కరోనా వ్యాధి నిరోధక ద్వారం ప్రారంభం
ప్రారంభించిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం: రాష్ట్రంలోనే మొదటిసారిగా విజయనగరం పట్టణంలో కరోనా వ్యాధినిరోధక ద్వారం (డిస్ ఇన్ఫెక్షన్ టన్నల్) ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ఏర్పాటు చేసిన కరోనా వ్యాధినిరోధక ద్వారాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల తమిళనాడులో జన సమూహం ఉన్న ప్రాంతాల్లో చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితిని మాధ్యమాల ద్వారా చూసి, ప్రస్తుత పరిస్థితుల్లో విజయనగరం ప్రజలకు తమ వంతు సహాయంగా కరోనా వైరస్ నిరోధానికి ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు.
విజయనగరం పట్టణంలో జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ నిరోధక ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా చేతులు శుభ్రంగా ఉండడం, కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ప్రతినిధి జి.ఈశ్వర్కౌశిక్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఏఎంసీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, అల్లు చాణక్య, బిజినెస్ ఆఫ్ యూత్ విజయనగరం ప్రతినిధులు అభినాష్ గాంధీ, బాలాజీ, హరికృష్ణ, చిన్ని ప్రదీప్, కాళ్ల సునీల్, రమేష్, ఎస్ఎస్ కంప్యూటర్స్ కిరణ్, దుర్గ, వై గేర్ ప్రసాద్, అబ్దుల్ పాల్గొన్నారు.