పోటీ చేయమని దిగ్విజయ్ ఆఫర్ చేశారు:టీ.జేఏసీ నేతలు
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని తెలంగాణ జేఏసీ నేతలకు రాష్ట్ర వ్యవహారాల రాజకీయ సలహాదారు దిగ్విజయ్ సింగ్ ఆఫర్ చేశారు. కొన్ని స్థానాల్లో టికెట్లు కేటాయిస్తామని దిగ్విజయ్ సూచించినట్లు టీ. జేఏసీ నేతలు తెలిపారు. గురువారం దిగ్విజయ్తో భేటీ అయిన అనంతరం టీ.జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. కాలయాపన చేయకుండా టి.బిల్లును..పార్లమెంట్లో ఆమోదింప చేయాలని కోరామని, ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలని దిగ్విజయ్ కోరినట్లు టీ.జేఏసీ నేతలు తెలిపారు.
రాజకీయాలపై తమకు ఆసక్తి లేదని, ప్రత్యేక తెలంగాణ సాధనే టీ.జేఏసీ ఎజెండా అని ఆచార్య కోదండరామ్ తెలపారని, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేకుంటే..కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రచారం చేయాలని దిగ్విజయ్ వారికి విజ్ఞప్తి చేశారన్నారు. కాగా, ఈ విషయంలో కూడా తెలంగాణ జేఏసీ నేతలు స్పందిచకపోవడంతో.. మీరంతా టీఆర్ఎస్ అనుబంధమా అని? తిరునావుక్కరసు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.