డిజిటల్‌ దోపిడీ

Digital Education Funds Misuse Tdp Government In Vijayanagaram - Sakshi

సాంకేతిక విద్య పేరిట  పచ్చపాతం

వర్చ్యువల్, డిజిటల్‌ క్లాస్‌  రూమ్‌ల పేరుతో నిధుల పందేరం 

బహిరంగ మార్కెట్‌కు, కాంట్రాక్ట్‌ ధరకు భారీ వ్యత్యాసం

ఒక్కొక్క యూనిట్‌పై లక్షన్నర నుంచి 3 లక్షల వరకు అదనం

ఒక్క జిల్లాలోనే సుమారు రూ.10 కోట్ల కుంభకోణం 

ఎన్నికలయ్యాక కూడా నడిచిన  దందా 

తాజా ఎత్తుగడకు చెక్‌ చెప్పిన  ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారులు

అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌  కింద సరఫరా చేసిన యూనిట్లపై అభ్యంతరం 

రూ.2.75 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.4.5 లక్షల బిల్లు.. రూ.3–3.5 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.6 లక్షలకు పైగా బిల్లు.. వర్చ్యువల్‌ క్లాస్‌ రూమ్, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ పేరుతో గత ప్రభుత్వ మాయాజాలం.. జిల్లాలో 257 పాఠశాలల్లో  వర్చ్యువల్‌ క్లాస్‌ రూమ్‌ ఎక్విప్‌మెంట్‌ యూనిట్ల సరఫరా.. ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ లేక 131 పాఠశాలల్లో మాత్రమే  ఇన్‌స్టాలైన ఎక్విప్‌మెంట్‌.. వాటిలో 92 పాఠశాలల్లోనే వర్కింగ్‌.. ఎక్విప్‌మెంట్‌ మొరాయింపుతో 39 పాఠశాలల్లో పనిచేయని పరిస్థితి.. అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ కింద 154 పాఠశాలలకు ఎక్విప్‌మెంట్‌ సరఫరా.. జూలైలో హడావుడిగా పాఠశాలలకు చేరవేత.. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ ఒప్పందం.. స్టేట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ వద్దని చెప్పినా పంపిణీ చేసిన ప్రైవేటు ఏజెన్సీ.. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు ఎన్నికల ముందు.. తర్వాత కొను‘గోల్‌మాల్‌’ ఎలా సాగిందో చూశారా! ముడుపులు, కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. కార్యరూపంలోకి వచ్చేసరికి వాటి డొల్లతనంతోపాటు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన చర్యల వెనక అవినీతి దాగుందని స్పష్టమవుతున్నది. శాశ్వత ప్రయోజనాలిచ్చే మౌలిక సదుపాయాల వైపు దృష్టి పెట్టకుండా సాంకేతిక బోధనాభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమం చేపట్టారు. వర్చ్యువల్‌ తరగతుల బోధన, డిజిటల్‌ తరగతుల బోధన పేరుతో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారు. ఒక్క జిల్లాలోనే రూ.10 కోట్ల మేర కుంభకోణం చోటు చేసుకుంది. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వర్చ్యువల్‌ తరగతి బోధన పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్‌ క్లాస్‌ రూమ్‌ స్టూడియో నుంచి ఉపాధ్యాయుడు అందించే బోధనను ప్రత్యక్ష ప్రసారం చేసేందు కు పాఠశాలలకు ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది. వర్చ్యువల్‌ క్లాస్‌ రూమ్‌ బోధన కార్యక్రమాన్ని 2018 ఏప్రిల్‌లో తొలి విడతగా 70 పాఠశాలల్లో, 2018 ఆగస్టులో రెండో విడతగా 99 పాఠశాలల్లో, 2019 ఫిబ్రవరిలో మూడో విడతగా 88 పాఠశాలల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్క పాఠశాలకు రూ.4.5 లక్షల విలువైన ఎక్విప్‌మెం ట్‌ యూనిట్‌ను సరఫరా చేశారు. ఒక్కొక్క యూ నిట్‌లో ఒక పోడియం, ఒక యూపీఎస్, ఆరు యూపీఎస్‌ ఎక్స్‌టర్నల్‌ బ్యాటరీలు, ఒక ల్యాప్‌ టాప్, ఒక ప్రొజెక్టర్, ఒక టాబ్లెట్‌ (కార్బన్‌), ఒక వెబ్‌ కెమెరా, ఒక ఇంట్రాక్టివ్‌ పెన్, 40 క్లిక్కర్స్, ఒక క్లిక్కర్‌ రిసీవర్, ఒక 4.1 ఆడియో సిస్టమ్, ఒక ఏసీ (ఇన్వెర్టర్‌) ఉంటాయి. ఇవన్నీ పాఠశాలలో అమర్చి, ఇన్‌స్టాల్‌ చేస్తేనే జిల్లా కేంద్రంలో ఉన్న వరŠుచ్యవల్‌ కాస్‌ రూమ్‌ స్టూడియో నుంచి ఉపాధ్యాయుల బోధనలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఎక్విప్‌మెంట్‌ యూనిట్‌ సరఫరా, నిర్వహణ ఒక ప్రైవేటు ఏజెన్సీకి గత ప్రభుత్వం అప్పగించింది. ఆ ఏజెన్సీ ప్రతినిధికి గత ప్ర భుత్వ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. 

ఫైబర్‌ నెట్‌ లేకుండానే... నాసిరకం ఎక్విప్‌మెంట్‌తో...
పరికరాలన్నీ అమర్చి, ఇన్‌స్టాల్‌ కావాలంటే ఆ పాఠశాలలకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. కళ్లెం ఇచ్చి గుర్రం ఇవ్వనట్టుగా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇవ్వకుండా ఎక్విప్‌మెంట్‌ సరఫరా చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. తొలి విడత 70 పాఠశాలల్లో 51 పాఠశాలలకు ఫెబర్‌ నెట్‌ కనెక్షన్‌లుండటంతో ఎక్విప్‌మెంట్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. మిగతా 19 పాఠశాలల్లో గత ఏడాది కాలంగా ఎక్విప్‌మెంట్‌ నిరుపయోగంగా ఉంది. ఇన్‌స్టాల్‌ చేసిన వా టిలో 19 పాఠశాలల్లో కొన్ని రోజుల్లోనే ఎక్విప్‌మెంట్‌ మొరాయించింది. అలాగే, రెండో విడత 99 పాఠశాలల్లో కేవలం 36 పాఠశాలలకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఉండటంతో ఎక్విప్‌మెంట్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. మిగతా 63 పాఠశాలల్లో సంబంధిత ఎక్విప్‌మెంట్‌ నిరుపయోగంగానే ఉంది. ఇన్‌స్టాల్‌ చేసినవాటిలోని ఏడు పాఠశాలల్లో కొన్ని రోజులకే ఎక్విప్‌ మెంట్‌ పనిచేయడం మానేసింది. మూడో విడతలో 88 పాఠశాలలకు ఎక్విప్‌మెంట్‌ యూనిట్లను సరఫరా చేయగా, వాటిలో 44 పాఠశాలలకు మాత్రమే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఉండటంతో ఇన్‌స్టాల్‌ చేశారు.

ఇందులో 13 పాఠశాలల్లో కొన్ని రోజులకే పనిచేయడం మానేశాయి. ఇలా మొత్తం 257 పాఠశాలల్లో 131 పాఠశాలలు మాత్రమే ఇన్‌స్టాల్‌కు నోచుకోగా, వాటిలో 92 మాత్రమే యాక్టివ్‌గా ఉ న్నాయి. 39 పాఠశాలల్లో పనిచేయడం లేదు. ఇక, 126 పాఠశాలలకు ఎక్విప్‌మెంట్‌ వచ్చి నా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ లేక ఇన్‌స్టాల్‌ కాలేదు. దీంతో అక్కడికొచ్చిన ఎక్విప్‌మెంట్‌ నిరుపయోగంగా ఉండిపోయింది. ఇందులో చెప్పాల్సిన విషయమేంటంటే పాఠశాలలకు వచ్చి న ఎక్విప్‌మెంట్‌ ఆశించిన క్వాలిటీలో లేవని తెలుస్తున్నది. దీనికి తోడు ఎక్విప్‌మెంట్‌ యూనిట్‌ విలువ రూ.4.5 లక్షల మేర చూపించినట్టు తెలిసింది. కానీ వాస్తవంగా దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.75 లక్షల మేర ఉంది. దాదాపు లక్షా 50 వేల వరకు తేడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. సాధారణంగా బల్క్‌లో తీసుకుంటే తగ్గాలి. కానీ ఇక్కడ ఎక్కువగా ఉంది. దీని వెనక పెద్ద గోల్‌మాల్‌ నడిచింది. ముడుపుల బాగోతం నడవడంతో కాంట్రాక్టర్‌ చెప్పిందే వేదం అన్నట్టుగా సాగిపోయింది. ఇదొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సాగింది. ఇదొక పెద్ద కుంభకోణం. ఇదీ వర్చ్యువల్‌ క్లాస్‌ రూమ్‌ బాగోతం. 

అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ మాయ...
అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ పేరుతో కూడా మరో కథ నడిచింది. ప్రాథమిక పాఠశాలలో అధునాతన డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ బోధనా కార్యక్రమాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎన్నికలకు ముందు చేసిన ఆలోచన. అదే సందర్భంగా యుద్ధప్రాతిపదికన ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకుం ది. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ పేరుతో 154 ప్రాథమిక పాఠశాలలకు ఎక్విప్‌మెంట్‌ యూనిట్లను సరఫరా చేశారు. 65 ఇంచెస్‌ ఇంట్రాక్టివ్‌ ప్లాట్‌ పేనల్, ఐఎఫ్‌పీ మౌంటెడ్‌ బ్రాకెట్, 1కేవీఎ ఆన్‌లైన్‌ యూపీఎస్, వైర్‌లెస్‌ కీ బోర్డు, మౌస్‌ వంటి పరికరాలతో కూడిన ఎక్విప్‌మెంట్‌ యూనిట్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరఫరా చేశారు. గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ జూలై 7వ తేదీ తర్వాత హడావుడిగా యూనిట్ల ను పాఠశాలలకు చేరవేసింది. ఒక్కొక్క యూని ట్‌ విలువ రూ.6 లక్షల మేర చూపించినట్టుగా ప్రస్తుత ప్రభుత్వ అధికారులు గుర్తించారు.

వాస్తవానికైతే మార్కెట్‌ ప్రకారం దాని విలువ రూ.3 లక్షల నుంచి 3.5 లక్షల మేర ఉంటుంద ని అంచనా. దాదాపు 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లాగేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించారేమో పాఠశాలలకు యూనిట్లు సరఫరా చేయవద్దని, తక్షణం నిలిపివేయాలని సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సంబంధిత సరఫరా ఏజెన్సీని జూలై 3వ తేదీన ఆదేశించారు. కానీ సద రు ఏజెన్సీ పట్టించుకోకుండా యుద్ధప్రాతిపది కన పాఠశాలలకు ఎక్విప్‌మెంట్‌ యూనిట్లను సరఫరా చేసేసింది. ఈ విషయం తెలుసుకున్న స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ తక్షణమే సర్వశిక్షా అభియాన్‌ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన యూనిట్లను తీసుకోవద్దని, అప్పటికే వచ్చేస్తే వాటిని తెరవొద్దని, ఇన్‌స్టాల్‌ చేయవద్దని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు ఆఫీసర్‌ సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా సంబంధిత యూనిట్లు ఎక్కడికక్కడ అక్కరకు రాకుండా ఉన్నాయి. వీటిలో కూడా నాసిరకం పరికరాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.       

ఎక్విప్‌మెంట్‌ యూనిట్లను  తెరవద్దని ఆదేశాలిచ్చాం..
అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ పేరుతో 154 పాఠశాలలకు సరఫరా చేసిన ఎక్విప్‌ మెంట్‌ యూనిట్లను తెరవద్దని సంబంధిత పాఠశాలల ప్ర«ధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశాల మేర కు తక్షణ ఆదేశాలిచ్చాను. ఎక్కడైనా తెరిచినట్టయితే సంబంధిత ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. 
– బి.శ్రీనివాసరావు, పీఓ, సర్వశిక్షా అభియాన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top