చదువుతోనే అభివృద్ధి

Development with Education says Ys jagan at Padayatra - Sakshi

     ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌

     అందుకే మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాది

     ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారమంతా భరిస్తాం

     పిల్లలను చదివించిన కుటుంబానికి రూ.15 వేలిస్తాం

     లంచాలు తీసుకుని భూములు కట్టబెట్టేందుకే కేబినెట్‌ మీటింగ్‌లు 

     ఈ చెడిపోయిన రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం తీసుకురావాలి

     హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసే పరిస్థితి రావాలి

     రేపటిమీద ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర

(ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): చదువే అభివృద్ధికి మార్గమని, చాలా సమస్యలకు పరిష్కారమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే మార్గమని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మ ఒడి’కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులకు అయ్యే ఫీజు మొత్తాన్ని భరిస్తామని, ప్రోత్సాహకంగా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరో రోజైన ఆదివారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అమృతనగర్‌లోనూ, మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని మరచిందని, లంచాలిచ్చే వారికి భూములు కట్టబెట్టేందుకే మంత్రివర్గ సమావేశాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. ఇంకా జగన్‌ ఏమన్నారంటే... 

పిల్లలను చదివిస్తే రూ.15 వేలు చేతికిస్తాం...
చంద్రబాబు పాలనలో పిల్లలు చదువుకునే పరిస్థితులు లేవు. ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదవాలంటే ఫీజు లక్ష రూపాయలు దాటుతుండగా... ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇస్తుందో, ఇవ్వదో కూడా తెలియదు. మిగిలిన డబ్బులు పేదవారు ఎక్కడ నుంచి తేవాలి? వారి పిల్లలు ఉన్నత విద్య ఎలా చదవాలి? అందుకే మనం అధికారంలోకి రాగానే పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ‘అమ్మ ఒడి’అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడతాం. ఇద్దరు పిల్లలను బడికి పంపించే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు అక్క, చెల్లెమ్మల చేతికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే కడుతుంది. ఫీజులు కట్టడంతో పాటు ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులకు ఖర్చులకు మరో రూ.20 వేలు ఇస్తాం. అలా చేయడం వల్ల ఆ పిల్లలు గొప్పగా చదువుకుంటారు. ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రత్యేకహోదా రావాలి. దాని సాధనకు మీరంతా కలిసిరావాలి. 

ప్రతి వర్గానికీ టోపీ పెట్టారు...
ఎన్నికల ముందు చంద్రబాబు రూ.87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో బంగారం బయటకు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా... మీ రుణాలు మాఫీ అయ్యాయా? మీ బంగారం బయటకు వచ్చిందా? (కాలేదు, రాలేదు అంటూ ప్రజలు సమాధానమిచ్చారు). చంద్రబాబు రైతుల ఓట్ల కోసం, వారిని మోసం చేసేందుకు మాటలు చెప్పారు. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడంలేదు. రైతన్నలు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి పేదవానికీ మూడుసెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తానని చెప్పారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టారా? పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు.. అందర్నీ మోసం చేశారు. ప్రతి సామాజిక వర్గానికీ టోపీ పెట్టారు.

లంచాల కోసమే కేబినెట్‌ మీటింగులు
చంద్రబాబు సీఎం కాకముందు రేషన్‌షాపుకు పోతే చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, కిరోసిన్‌ దొరికేది. ఇవ్వాళ రేషన్‌షాపుకు పోతే బియ్యం తప్ప మరేంఇవ్వడంలేదు. ఆ బియ్యం కూడా మిగిలించుకునేందుకు వేలిముద్రలు పడటం లేదంటూ అవ్వాతాతల కడుపుమీద కొడుతున్నారు. పెన్షన్‌ రావడం లేదని చాలా మంది వృద్ధులు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో లంచాలిచ్చే వారికి మాత్రమే పనులు జరుగుతున్నాయి. పేదవాని నుంచి భూములు లాక్కునేందుకు, లంచాలు తీసుకుని వాటిని బడా బాబులకు కట్టబెట్టేందుకే కేబినెట్‌ మీటింగ్‌లు జరుపుతున్నారు. ఇంతటి దారుణమైన పాలనను తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలున్నప్పుడు, రేపటిమీద భరోసా ఇచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టాను. ఈ చెడిపోయిన రాజకీయాల్లో విశ్వసనీయత అనే మాటకు అర్థం తీసుకురావాలి. లేదంటే చంద్రబాబు రేపటి ఎన్నికల్లో ప్రతి ఇంటికీ మారుతీ కారు, కేజీ బంగారం ఇస్తానంటాడు. రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని చెప్పిన మాటలు అమలు చేయకపోతే, రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. ఏడాది తర్వాత వచ్చే మన పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రూ.రెండు వేలు పెన్షన్లు ఇస్తామని మాటిస్తున్నా. 

ప్రతి సామాజిక వర్గాన్నీ కలుస్తా...
నేను తలపెట్టిన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతీ గ్రామాన్నీ, ప్రతి సామాజిక వర్గాన్ని కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల్లో ఏదైనా మార్పులు చేయాల్సి ఉంటే సలహాలివ్వండి. మన మేనిఫెస్టో మీ ఆలోచనలనుంచి వస్తుంది. చంద్రబాబు మాదిరిగా కులానికో పేజీ కేటాయించి అబద్ధపు హామీలతో మోసంచేయడంఉండదు. అన్ని అబద్ధాలు చెప్పారు కాబట్టే, అన్ని మోసాలు చేశారు కాబట్టే ఆఖరుకు టీడీపీ వెబ్‌సైట్‌లో నుంచి కూడా మేనిఫెస్టో తీసేశారు. ఆ మేనిఫెస్టో అందుబాటులో ఉంటే, అందులోని హామీలు నెరవేర్చలేదేమిటని ప్రజలు కొడతారని ఆయనకు భయం. మన మేనిఫెస్టో అలా ఉండదు. రెండు లేదా మూడు పేజీల్లో ఉంటుంది. అందులో ప్రతీ అంశం మీరు దిద్దినదే ఉంటుంది. అందులో చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేసి చూపిస్తాం. మేమిచ్చిన హామీలన్నీ నెరవేర్చాం మరోసారి దీవించండని 2024లో మీ ముందుకు వస్తాం.  

ప్రొద్దుటూరు శివారు అమృత నగర్‌లో రాట్నం తిప్పి నూలు వడుకుతున్న వైఎస్‌ జగన్‌ 

   

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారమంతా భరిస్తాం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top