సీపీఎస్ రద్దు హామీకి కట్టుబడి ఉన్నాం
ఉద్యోగులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి
శ్రీకాకుళం,రాజాం సిటీ/ రేగిడి: సీపీఎస్ విధానం రద్దుకు సంబంధించి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రేగిడి మండలం చిన్న శిర్లాంలో జగన్మోహన్రెడ్డిని ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగులతోపాటు పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన 300 మంది ఉద్యోగులు కలిసి సమస్య విన్నవించారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన సీపీఎస్ రద్దుకు గతంలోనే హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఇచ్చినమాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
అంతవరకూ సీపీఎస్ ఉద్యోగులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. తమ డిమాండ్కు జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించడంపై సీపీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.86 లక్షల మంది, జిల్లాలో 15 వేల మందికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో మజ్జి మదన్మోహన్, మక్క సురేష్, మురపాక వెంకటరమణ, గడే వాసు, లెంక రామకృష్ణ, సామంతుల సత్యనారాయణ, కుప్పిలి సాయిరమేష్, కె.చంద్రినాయుడు, డోల వాసు తదితరులు ఉన్నారు.