ఏపీలో 5 లక్షలకు చేరువలో కోవిడ్–19 పరీక్షలు
కోలుకున్న వారు 2,869
తాజాగా 94 మంది డిశ్చార్జ్
15,384 మందికి పరీక్ష చేస్తే 218 మందికి పాజిటివ్
1.49%కి తగ్గిన మరణాల రేటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నిర్ధారణ పరీక్షలు 5 లక్షల మార్కుకు చేరువయ్యాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 15,384 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 4,98,716కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 136 కేసులు రాష్ట్రంలో నమోదు కాగా, 56 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలో, 26 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
5,247కు చేరిన పాజిటివ్ కేసులు
► రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,247కు చేరుకుంది. వీటిలో విదేశాల నుంచి వచ్చిన కేసులు 188 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులు 933 ఉన్నాయి.
► బుధవారం ఒక్కరోజే 94 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 22 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.
► రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,869కు చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మరణం నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది.
► మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,300కు చేరుకున్నాయి.