నరసింహకొండపై దంపతుల ఆత్మహత్య

Couple suicide on Narasinhakonda - Sakshi

నెల్లూరు(వేదాయపాళెం): నెల్లూరురూరల్‌ మండలం నరసింహకొండపై సోమవారం కల్లుగీత కుటుంబానికి చెందిన దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌ కథనం మేరకు దగదర్తి మండలం తురిమెర్ల గ్రామానికి చెందిన తాతా వెంకటరమణయ్య(55), అతని భార్య శారదమ్మ(50) కల్లుగీత వృత్తి ద్వారా జీవించేవారు. 15 ఏళ్లుగా భార్యాభర్తలిద్దరూ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. నెల్లూరులో చికిత్స అనంతరం చెన్నైకి వెళ్లి చికిత్స పొందుతుండేవారు. వీరికి ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత కొంతకాలంగా మనస్థాపం చెందుతుండేవారు. 

నరసింహకొండకు చేరుకొని శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో రోడ్డు పక్కన కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో పురుగు మందు కలుపుకొని భార్యాభర్తలిద్దరూ సేవించి మృతిచెందారు. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహాలను అక్కడున్న వారు గమనించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో దంపతుల ఆత్మహత్య స్థానికులను కలచివేసింది. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top