అష్టకష్టాలు పడుతున్నాం.. ఆదుకోండి
ప్రతిపక్ష నేతకు విత్తనోత్పత్తి రైతుల గోడు
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మా గోడు వింటే మహాభారతం, రాస్తే రామాయణం అవుతుందని పత్తి విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆళ్లగడ్డ నియోజకవర్గం దోర్నిపాడు సమీపంలోని భాగ్యనగరం వద్ద పలువురు రైతులు కలిశారు. తమ సమస్యలను వివరించారు. అష్టకష్టాలు పడి విత్తనాలను ఉత్పత్తి చేస్తే నష్టాలే భరించాల్సి వస్తోందని వాపోయారు.
విత్తనోత్పత్తి చేస్తున్న ఓ క్షేత్రాన్ని జగన్ స్వయంగా పరిశీలించారు. రైతుల ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దొర్నిపాడుకు చెందిన రైతు బాలిరెడ్డి మాట్లాడుతూ... విత్తన ఉత్పత్తిలో నష్టం వచ్చినా ప్రభుత్వం బీమా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల గోడు విన్న జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ... తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విత్తనోత్పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. పత్తి పండించే వారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని, గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.