ఏపీలో ఏడుకు చేరిన కరోనా కేసులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నంలో లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది. దీంతో ఏపీ కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మార్చి 31వరకు లాక్డౌన్ ప్రకటించారు. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజలు లాక్డౌన్ పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.