కరోనా వైరస్: జిల్లాలో అలెర్ట్
చైనా నుంచి ఇటీవల జిల్లాకు తిరిగి వచ్చిన వారిపై నిఘా
చైనా వెళ్లి వచ్చిన చిలకలూరిపేట వ్యక్తికి వైద్య పరీక్షలు
కరోనా వైరస్ లక్షణాలు లేనట్లు గుర్తింపు
గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు
సాక్షి, గుంటూరు: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాతో సహా తూర్పు ఆసియా దేశాల్లో ఈ వైరస్ సోకి వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రతగా హై అలర్ట్ ప్రకటించింది. కరోనా వైరస్ ఛాయలు ఎక్కడ కనిపించినా తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో చైనా నుంచి ఇటీవల కాలంలో జిల్లాకు తిరిగి వచ్చిన వారిపై అధికారులు నిఘా పెట్టారు. జిల్లాలోని చిలకలూరిపేటకు చెందిన నాదెండ్ల వెంకటసుబ్బయ్య ఈ నెల 9న చైనా విహార యాత్రకు వెళ్లి 19వ తేదీన వచ్చారు. ఈ విషయం తెలిసిన వైద్య అధికారులు అతనికి కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమోనని వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం నాదెండ్ల మండలం గణపవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారి డాక్టర్ గోపినాయక్ వెంకటసుబ్బయ్యను విచారించి ఆయనకు కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదించారు. (ఏపీలో ‘కరోనా’ జాడ లేదు: ఆళ్ల నాని )
జీజీహెచ్లో ప్రత్యేక వార్డు
కరోనా వైరస్ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తక్షణమే చికిత్స అందించడం కోసం ముందస్తుగా గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డుకు జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ టీవీ ఆదిశేషును ఇన్చార్జిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబులాల్ నియమించారు.
అప్రమత్తతే రక్ష
క్యూలెక్స్ అనే దోమ కాటుతో కనిపించే రోగ లక్షణాలే ఇంచుమించుగా కరోనా వైరస్ రోగుల్లోనూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో కూడిన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారికి కనిపిస్తాయి. ప్రస్తుతం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరికైనా ఆ తరహా లక్షణాలు ఉంటే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ప్రయాణికులకు దూరంగా ఉండాలి. ముక్కు, నోరు కప్పి ఉండేలా ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధా న్యం ఇవ్వాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డుగా రుమాలు పెట్టుకోవాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చలిలోఎక్కువగా తిరగకూడదు. సాధ్యమైనంత వరకు విదేశీ ప్రయాణం వాయిదా వేసుకోవాలి.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు మెడికల్: చైనాను వణికించటంతోపాటుగా పలు దేశాల్లో నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల పట్ల జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్వో కార్యాలయంలో సీహెచ్, ఎంపీహెచ్ఈవోలతో ఆమె నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ ఏఎన్ఎంలు, సచివాలయం ఏఎన్ఎంలు ఎంత మంది ఉన్నారనే విషయాలను తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలోని నోటీస్ బోర్డులో పెట్టాలన్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగబోయే లెప్రసీ కార్యక్రమంపై అవగాహన కలి్పంచి కొత్తగా కుషు్టవ్యాధి కేసులను గుర్తించాలని ఆదేశించారు.
ఫిబ్రవరి 1 నుండి డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడోదశ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అందరికి కంటి పరీక్షలు చేయించాలని చెప్పారు. ఆర్బీఎస్కే జిల్లా కో– ఆర్డినేటర్ డాక్టర్ గుడిసె చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఆ రోజున తప్పనిసరిగా 19 ఏళ్ళలోపు పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీటీసీవో డాక్టర్ తాళ్లూరి రమే‹Ù, లెప్రసీ అధికారి డాక్టర్ బండారు సుబ్బారావు, డీబీసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉయ్యూరు రాజశేఖర్, జిల్లా మలేరియా అధికారి అల్లాడి జ్ఙానశ్రీ, గణాంక అధికారి ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు.