వ్యవసాయ శాఖలో... విస్తరణాధికారుల కొట్లాట
విస్తరణాధికారిని సరెండర్ చేస్తూ నివేదిక
పూసపాటిరేగ: పూసపాటిరేగ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు విస్తరణాధికారుల మధ్య చెలరేగిన వివాదం కొట్లాటకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే..ఇక్కడి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విస్తరణాధికారిగా పని చేస్తున్న జె.కృష్ణ ఆరోగ్యం బాగాలేకపోవడంతో బదిలీ చేయాలని కోరేందుకు విజయనగరం డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్.శ్రీనువాస్ వద్దకు తన సోదరుడుతో వెళ్లారు. ఏడీ స్పందిస్తూ పూసపాటిరేగ ఏఓ ఎ.శ్రీనువాసరావు ద్వారా బదిలీ విషయమై ప్రతిపాదన రావాలని సూచించారు.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో విస్తరణాధికారి కృష్ణ తమ సోదరుడుతో పాటు పూసపాటిరేగ వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలోకి కృష్ణ రాగానే మరో విస్తరణాధికారి వై.వినయ్ స్పందిస్తూ ఏఓకు తెలియకుండా ఏడీ వద్దకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాదులాట చోటు చేసుకొంది. ఇద్దరు పరస్పరం కొట్లాడుకున్నారు. ఈ సయయంలో అక్కడే ఉన్న ఏఓ శ్రీనివాసరావు జోక్యం చేసుకొని వారించారు. అనంతరం ఇద్దరిపై ఏఓ ఆగ్రహించారు. కార్యాలయంలో రౌడీల్లా ప్రవర్తించడమేమిటని చిర్రెత్తారు. అక్కడికక్కడే విస్తరణాధికారి కృష్ణ ప్రవర్తనపై నివేదిక రాసి జేడీకి సరెండర్ చేస్తూ నివేదిక పంపారు.