ఆస్తి మూరెడు.. అప్పు బారెడు

The consequences of state government policies - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ విధానాల పర్యవసానం

1956 నుంచి 2014 వరకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.96 వేల కోట్లు 

2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పు మరో రూ.1.20 లక్షల కోట్లు  

ఈ మూడున్నర ఏళ్లలోనే అప్పులు 125 శాతం పెరుగుదల  

పరిమితికి మించి అప్పులు చేసుకుంటూపోతున్న టీడీపీ ప్రభుత్వం 

అప్పు తెచ్చిన డబ్బంతా ఆర్భాటాలకే ఖర్చు.. కమీషన్లు వచ్చే ప్రాజెక్టుల పనులకే మొగ్గు 

ఈవెంట్ల పేరుతో జల్సాలు... కమీషన్ల కోసమే పెరిగిన ప్రాజెక్టుల అంచనాలు 

తాత్కాలిక కట్టడాలకే వేల కోట్లు వృథా.. కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు

  చేబదుళ్లు సకాలంలో తీర్చలేక వడ్డీ కిందే రూ. 100 కోట్లు కట్టిన బాబు సర్కారు

సాక్షి, అమరావతి: ఓ కుటుంబ పెద్ద అప్పు చేయాలంటే వందసార్లు ఆలోచిస్తాడు. ఆస్తులు కొనడానికో లేదా ఆదాయం పెంచుకోవడానికో మాత్రమే అప్పులు చేస్తాడు. అదేమీ తప్పు కాదు కూడా. కానీ అలా కాకుండా అప్పులు చేసి జల్సా చేస్తామని, ఎడాపెడా దుబారా చేస్తామని అంటే దివాలా తీస్తారని చెప్పడానికి ఆర్థిక సూత్రాలు ఔపోసన పట్టనక్కరలేదు..  

అదే ఓ రాష్ట్రానికి పెద్ద అయిన ముఖ్యమంత్రి అప్పులు చేస్తున్నారంటే ఎన్ని ఆలోచిస్తారు..? అందులోనూ మంచి ‘అనుభవజ్ఞుడు’ కాబట్టి చాలా ఆలోచించి.. ఆస్తులు సృష్టించడానికి, ఆదాయం పెంచడానికి మాత్రమే అప్పులు చేస్తున్నారని అంతా అనుకున్నారు. 

కానీ పప్పులో కాలేసినట్లు తేలిపోయింది. ఉమ్మడి రాష్ట్రం  ఏర్పడిన 1956 నుంచి 2014 వరకు చేసిన అప్పుల కంటే విభజన తర్వాత ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులు దాదాపు రెట్టింపునకు చేరువయ్యాయని తెలిస్తే గుండె గుభేల్‌ మనక మానదు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు కూడబెట్టిందో.. లేక కొత్తరాష్ట్రంలో శాశ్వత భవనాలకు వెచ్చించిందో లేదంటే ఆదాయ మార్గాలను సృష్టించిందో అనుకుంటే పొరపాటే. ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనం లేదు. కట్టిన సచివాలయం, అసెంబ్లీ బిల్డింగులు తాత్కాలికమే.. అవీ వర్షాలకు బీటలువారాయి. రాజధానికి ఒక్క ఇటుక ఎత్తిందీ లేదు. అసలు డిజైన్ల దశ దాటడానికే నాలుగేళ్లు చాలలేదు. మరి నాలుగేళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులు ఎందుకు చేసింది? అప్పు చేసి తెచ్చిన రూ.1.20 లక్షల కోట్లు ఎటుపోయాయి? ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్లు ఎలా ఖర్చు చేశారబ్బా అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి..  
 
అప్పుచేసి ఖర్చుపెట్టేస్తే.. 
అప్పు చేసి ఆస్తులు లేదా ఆదాయ మార్గాలను సృష్టించేవారిని విజ్ఞులంటాం.. అలా కాకుండా అప్పులు చేసి  రోజువారీ ఖర్చులకు, ఈవెంట్లకు, జల్సాలకు దుబారాగా ఖర్చు చేసేవారిని ఏమనాలి? రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి 2017 సెప్టెంబరు వరకు మూడున్నర ఏళ్లలో తెలుగుదేశం సర్కారు రాష్ట్ర ప్రజలపై మోపిన అప్పుల భారం మరో రూ. 1,20,611 కోట్లు. ఇన్ని అప్పులు చేసి ఒక్కటన్నా ఆస్తులు పెంచారంటే లేదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా దుబారాలకు, ఈవెంట్లకు విచ్చలవిడిగా వెచ్చించడంతో తెచ్చినన్నీ తరిగిపోవడంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇది రూ.73,135 కోట్లకు చేరుకుందంటే దుబారా ఏస్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.  

మిగిలిన రూ.47,476 కోట్లనయినా ఆస్తులు పెంచడానికి, ఆదాయమార్గాలను సృష్టించడానికి వెచ్చించారా అంటే అదీ లేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు. వాటితోపాటు పాత ప్రాజెక్టుల పనుల్లో జీవో నంబర్‌ 22 ద్వారా భారీగా అంచనాలు పెంచి కాంట్రాక్టర్ల ద్వారా సాగించిన దోపిడీ మాత్రమే కనిపిస్తున్నాయి. చేసిన అప్పుల్లో సగం కూడా నిర్మాణాత్మకంగా ఖర్చు చేసినట్టు కానరావటం లేదు. 1956–2014 మధ్య కాలంలో రాష్ట్రప్రభుత్వాలు చేసిన అప్పుల్లో 87 శాతం ఆస్తుల కోసం ఖర్చు చేశారు. మిగిలిన 13 శాతం కూడా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన 9 ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వం వల్ల సంక్రమించిన రెవెన్యూ లోటు(రూ.22,126 కోట్లు) తీర్చటానికే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో తెచ్చిన అప్పుల్లో 39 శాతం మాత్రమే పెట్టుబడి వ్యయం(క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌)కు ఖర్చుపెట్టి, మిగిలిన 61 శాతం రెవెన్యూ లోటు భర్తీ కోసం వెచ్చించారు. 
 
అన్నీ దుబారా...  
ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) చట్టం ఉండగా పరిమితుల్ని, నిబంధనలను అతిక్రమించి ఎలా అప్పు చేస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ సమాధానం లేదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ముందు చూపులేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడమే ఈ దుస్థితికి కారణమని విమర్శకులంటున్నారు. ఈవెంట్ల పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, ఆస్తులను సమకూర్చుకోకుండా దుబారా వ్యయాలు చేయడం వల్లే అప్పులు భారీగా పెరుగుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో మాదిరిగా చిన్న అప్పు తీర్చటానికి పెద్ద అప్పు, అది తీర్చటానికి మరో భారీ అప్పు చేసుకుంటూ పోతే విజయ్‌ మాల్యా, టీడీపీ ఎంపీల్లో కొందరు బ్యాంకుల్ని ముంచినట్టే... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే ముంచివేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఆర్థిక నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.  
 
అంచనాలు పెంచి అంతులేని దోపిడీ... 
టీడీపీ సర్కారు వీలున్న చోటల్లా చేయిచాచి రాష్ట్రాన్ని పరాధీనంలోకి గెంటేయటంతో ఆస్తులు, అప్పుల నిష్పత్తి మారిపోయింది. అప్పులు పెరిగిపోతుండగా ఆస్తులు తరిగిపోతున్నాయి. తదుపరి ప్రభుత్వాలకు అప్పు పుట్టనీయకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు సర్కారు రుణాల ఊబిలోకి నెట్టివేస్తోంది. అప్పులను హంగూ ఆర్భాటాలకే వెచ్చించడంతో అప్పుల శాతం పెరిగిపోయి ఆస్తులు కరిగిపోతున్నాయి. అప్పులతో శాశ్వత రాజధాని గానీ, శాశ్వత సాగునీటి ప్రాజెక్టులను గానీ చేపట్టలేదు. కమీషన్ల కోసం తాత్కాలికంగా పట్టిసీమను రూ. 1,600 కోట్లతో చేపట్టగా అందులో 353 కోట్ల రూపాయలు కమీషన్లు చేతులు మారినట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. కాంట్రాక్టర్‌కు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు నివేదికలో కాగ్‌ పేర్కొంది.

గత మూడున్నరేళ్లలో సెప్టెంబర్‌ వరకు సాగునీటి రంగానికి 35,819 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఇందులో సాగునీటి పనులకు వ్యయం చేసింది తక్కువ కాగా జీవో 22 ప్రకారం పాత పనులకు ఎస్కలేషన్‌ పేరుతో భారీగా కాంట్రాక్టర్లకు చెల్లించేసి కమీషన్లను కాజేసింది ఎక్కువగా ఉంది. నీరు–చెట్టు పేరుతో గత మూడున్నరేళ్లలో నామినేషన్లపై 9,906.88 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. ఇందులో 90 శాతం నిధులు టీడీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఎక్కడా ఆస్తుల కల్పన అనేది జరగలేదు. తాత్కాలిక రాజధాని పేరుతో 1,000 కోట్ల రూపాయలను వెచ్చించడమే తప్ప శాశ్వత రాజధాని కోసం ఇప్పటి వరకు చేసింది శంకుస్థాపనల పేరుతో ఆర్భాటమే. తాత్కాలిక పనులకు వందల కోట్ల రూపాయలను వెచ్చించడమే తప్ప శాశ్వత నిర్మాణాలకు పైసా వెచ్చించలేదు. మరో పక్క పేదలకు పక్కా గహాల నిర్మాణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను వెచ్చించకుండా లబ్ధిదారుల ఎంపిక పేరుతో కాలం వెల్లబుచ్చుతోంది.  
 
ఆర్థిక క్రమశిక్షణకు తిలోదకాలు   

రోజూ ఆర్బీఐ నుంచి చేబదుళ్లతోనే సర్దటంతో రాష్ట్ర ఆర్థిక పరపతి పడిపోతోంది. భవిష్యత్‌లో అప్పులు పుట్టడంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర పరపతి పడిపోవడంతో గత నెలలో 800 కోట్ల రూపాయల అప్పునకు వెళ్లగా వడ్డీ ఎక్కువగా ఉండటంతో అప్పు తీసుకోవడానికి ఆర్థిక శాఖ వెనుకాడింది. ఆర్బీఐ ప్రతి రాష్ట్రానికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యం కల్పిస్తుంది. ఇది ఒక రకంగా చేబదులు. ఇలా తీసుకున్న సొమ్మును 14 పనిదినాల్లో తిరిగి చెల్లించేయాలి. లేదంటే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అయితే 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం చేబదుళ్లకు వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిని తీసుకువచ్చింది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజార్చిందో అర్ధం చేసుకోవచ్చు.  
 
చేబదుళ్లపై వంద కోట్ల వడ్డీ 
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేబదుళ్లను సకాలంలో తీర్చనందుకు  ఏకంగా 100 కోట్ల రూపాయలను వడ్డీ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం మార్కెట్‌ రుణాల కింద 16,100 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇందులో క్యాపిటల్‌ వ్యయం కింద కేవలం రూ. 9,955 కోట్లనే ఖర్చు చేశారు. మిగతా నిధులన్నీ రెవెన్యూ లోటు కింద వ్యయం చేశారు. 
 
బాబు ఎట్‌ ది రేట్‌ అప్పు 
చంద్రబాబు సీఎం కాకముందు 1995కు ముందుగానీ, 2004లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోగానే ఇతర ప్రభుత్వాల హయాంలోగానీ ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు లేదు. 2014 నుంచి ఇప్పటివరకూ మళ్లీ రెవెన్యూ లోటు ఏర్పడింది. 1956 – 1994 తరువాత రెవెన్యూ మిగులు సుమారుగా రూ. 200 కోట్లు ఉంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా ఎన్నో భారీ ప్రాజెక్టులు నిర్మించటం సాధ్యమైంది. అదే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉండగా రూ.50 వేల కోట్లు అప్పు చేస్తే అందులో రూ.22,000 కోట్లు రెవెన్యూ లోటు పూడ్చటానికే సరిపోయింది. అంటే చేసిన అప్పుల్లో రూ.28,000 కోట్లు మాత్రమే ఆస్తుల కల్పన కోసం క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌గా మిగిలింది. 2004లో చంద్రబాబు దిగిపోయి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆయన మరణించాక మరో ఇద్దరు సీఎంలు మారిన తరువాత కూడా పదేళ్ల కాలంలో రూ.11,000 కోట్లు రెవెన్యూ మిగులు ఉంది. అంటే తెచ్చిన అప్పులు, రెవెన్యూ మిగులు కలిపి ఆస్తుల కల్పనకు ఉపకరించాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. గతంలో ఆయన హయాంలో రూ. 22,000 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడితే ఈసారి భారీగా, కనీవినీ ఎరగనంతగా 2014 ఏప్రిల్‌ నుంచి 2017 సెప్టెంబరు దాకా మూడున్నరేళ్లకు ఏకంగా రూ.73,135 కోట్లు రెవెన్యూ లోటు తలెత్తింది. తెచ్చిన అప్పుల్లో 69 శాతం రెవెన్యూ లోటు భర్తీకే సరిపోయింది. ఇది ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాగ్‌ గణాంకాల పట్టికను పరిశీలిస్తే అవగతమవుతుంది. 

 బాబు హయాంలోనే లోటు.. 
1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2014లో విడిపోయే వరకు 58 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.96,000 కోట్లు. 58 ఏళ్లకూ కలిపి రెవెన్యూ లోటు సుమారుగా రూ.12,000 కోట్లు ఉంది. ఈ లోటుకు కూడా ప్రధాన కారణం 1995–2004 మధ్య చంద్రబాబు పరిపాలనే. ఆయన హయాంలో ఏర్పడిన రెవెన్యూ లోటు, తరవాత పదేళ్లలో వచ్చిన రెవెన్యూ మిగులు, అంతకు ముందు రెవెన్యూ మిగులు అంతా కలిపితే రాష్ట్రం విడిపోవటానికి ముందు నికరంగా రూ.12,000 కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోంది. 
 
భవిష్యత్తుపై ప్రభావం.. 
పరిమితులను పట్టించుకోకుండా స్తోమతకు మించి టీడీపీ సర్కారు చేస్తున్న అప్పుల వల్ల భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలు కేవలం వడ్డీలు, పాత బకాయిలు తీర్చుకుంటూ క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌గా ఖర్చు చేసేందుకు పైసా కూడా దొరకని దుస్థితి ఇప్పటికే కనిపిస్తోంది.  ఎఫ్‌ ఆర్‌ బీ ఎం చట్టాన్ని పట్టించుకోకుండా అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీ ఆధారంగా అప్పు  చేసి అది కూడా దుర్వినియోగం చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది.

జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై రూ. 3,000 కోట్ల అప్పు చేయడానికి గతంలో కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల జరిగిన కేబినెట్‌ ఆ పరిమితిని ఎత్తివేస్తూ మరో నిర్ణయం తీసుకుంది. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై ఏకంగా రూ. 30,000 కోట్ల అప్పు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మరోపక్క రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని, ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి వచ్చే ఎన్నికల నాటికి కమీషన్లను దండుకోవాలని రాష్ట్ర సర్కారు పెద్దల నిర్ణయంగా ఉందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top