టీడీపీ దీక్షలో కాంగ్రెస్ నేతల షో..!
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తలపెట్టిన దీక్షా శిబిరం కాంగ్రెస్ అగ్రనేతల షోకు వేదికగా మారింది. దీక్షా శిబిరంలో కాంగ్రెస్ సీనియర్ల హడావిడి మామూలుగాలేదు. ఆ పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్లు వేదికపై తమ సొంత పార్టీ కార్యక్రమంలా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు తనకు యూత్ కాంగ్రెస్ రోజుల నుంచే మంచి మిత్రుడని గులాంనబీ ఆజాద్ వారి మిత్రత్వాన్ని బయటపెట్టారు.
సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ విభజన బిల్లుపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ఇదే బిల్లుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇప్పుడు మాటమార్చడంతో ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్తో చంద్రబాబు దోస్తీ ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిండంలో, పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని గతంలో అనేక సార్లు చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పట్లో బీజేపీతో భాగస్వామిగా ఉండి రాహుల్, సోనియా గాంధీని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్ చెంతకు చేరి మోదీని విమర్శిస్తున్నారు. దీంతో చంద్రబాబు మాటలు ఏవిధంగా మారుస్తారనే విషయం ఇట్టే అర్థమవుతోంది.