‘దేశం’లో కులకలం

Conflicts In TDP Party PSR Nellore - Sakshi

అధికార పార్టీలో పెత్తనంపై తిరుగుబాటు రాజకీయం

టార్గెట్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద రవిచంద్ర

ప్రాధాన్యం లేదంటూ సొంత సామాజికవర్గ నేతల తీవ్ర అసంతృప్తి

జిల్లా మంత్రి సూచనతోనే సమావేశం 19న మళ్లీ రెండో పర్యాయం భేటీ

కుల సమావేశంపై పార్టీ నేత టీడీ జనార్దన్‌ ఆరా

విజయవాడకు రావాలని ఆదాలకు పిలుపు

అధికార పార్టీలో కుల చిచ్చు కలవరపెడుతోంది. అధికార పెత్తనంపై తిరుగుబాటు రాజకీయ సమరానికి తెరలేచింది. పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశమై పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, జిల్లా పార్టీలో మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రల ప్రాధాన్యం, పెత్తనంపై సదరు నేతలు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. టీడీపీ అంటేనే ఆ సామాజికవర్గానిదే అనే రీతిలో ఆ నేతల వ్యవహార శైలి ఉండటంతో ఈ పరిమాణాలు ఎలా దారితీస్తాయోనని పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కులాల పోరు ఎన్నికల వేళ బహిర్గతం కావడం, అది కూడా పొరుగు జిల్లాలో రహస్య సమావేశం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సమావేశ నిర్వహణకు తెరవెనుక ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు, ఎవరిని టార్గెట్‌ చేసి సమావేశం నిర్వహించారనే దానిపై పార్టీ నేత టీడీ జనార్దన్‌ ఆరా తీసినట్లు సమాచారం. మంగళవారం విజయవాడకు రావాలని ఆదాలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్టు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ అధినేత సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. సాధారణంగా జిల్లాలో అధికార పార్టీ సామాజిక వర్గం కాకుండా మరో కీలక సామాజిక వర్గ నేతలే దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కురగుండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావుతో పాటు ఆత్మకూరు మాజీ ఇన్‌చార్జి కన్నబాబు, పార్టీ నేతలు గంగాప్రసాద్, బొల్లినేని కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడుతో పాటు సామాజిక వర్గానికి చెందిన మండలస్థాయి నేతలు, ఇతర పదవుల్లో ఉన్న నేతలు ఆదివారం తిరుపతిలో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి నాలుగు రోజుల ముందే ఈ సామాజిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నేతృత్వం వహించేలా ముందుగానే సిద్ధం చేసి ఆ మేరకు నడిపించారు. ఇది కూడా జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి సూచనతోనే జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తిరుమల దర్శనానికి వచ్చిన కర్ణాటక మంత్రికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు అనంతరం ఆ సామాజికవర్గ సమావేశంలో నేతలు పరోక్షంగా కొందరి తీరును తప్పుబట్టారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు తమ ఆవేదనను ఇతర నేతల వద్ద వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మంది ఎస్సైలను మారిస్తే ఇద్దరి విషయం మాత్రమే తనకు తెలుసునని, ఇది తనకు ఇస్తున్న ప్రాధాన్యత అని బొల్లినేని ఆవేదన వ్యక్తం చేయగా,  వెంకటగిరి నియోజకవర్గంలో పనులు, పదవులు తనతో నిమిత్తం లేకుండా వేస్తున్నారని కురుగండ్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం షెడ్యూల్‌ తీసుకుని రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ మా ఇంట్లో పెళ్లి చేస్తే కనీసం లోకేష్‌ కూడా కార్యక్రమానికి హాజరుకాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో 100 ట్రాక్టర్లు ఇస్తే 95 ట్రాక్టర్లు పాత కాంగ్రెస్‌ నేతలకే ఇస్తే తాము ఎలా రాజకీయాలు చేయాలని ఆత్మకూరు మాజీ ఇన్‌చార్జి కన్నబాబు ఆకోశ్రం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే తన నియోజకవర్గంలో కొత్త నేతను జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రోత్సహిస్తున్నారని బొల్లినేని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద సొంత కులానికే జిల్లా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ముగ్గురు నేతలు అభిప్రాయపడి 19న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశానికి హజరైన మిగిలిన నేతలు వీరి వ్యాఖ్యలపై మాట్లాడకుండా మౌనం వహించినట్లు తెలిసింది. బొల్లినేని కృష్ణయ్య మాత్రం ఇవ్వన్ని సరికావని సూచించినట్లు తెలుస్తోంది.  

ఆదాలతో సీఎం గంటలు గంటలు ఎలా మాట్లాడతారు
ఈ సమావేశంలో కన్నబాబు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని టార్గెట్‌ చేసి మాట్లాడారని తెలిసింది. దీనికి మిగిలిన ఎమ్మెల్యేలు మౌనం వహించటంతో పాటు ఎవరి బాధలు వారు వెళ్లగక్కటంతో కొత్త కుల రాజకీయానికి తెరలేచింది. మనం సీఎం అపాయింట్‌మెంట్‌ కోరితే ఇవ్వని చంద్రబాబునాయుడు ఆదాల ప్రభాకరెడ్డికి గంటలు గంటలు ఆపాయింట్‌మెంట్‌ ఇవ్వటం, నెల్లూరు పార్లమెంట్‌పై పూర్తి పెత్తనం అప్పగించడం ఏమిటని నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద టార్గెట్‌ ఆదాలగా సామాజిక కుల సమావేశం జరగ్గా పనిలో పనిగా బీద రవిచంద్రపైన ఎమ్మెల్యేలు ఫైర్‌ అవ్వటంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నేత టీడీ జనార్దన్‌ జరిగిన పరిణమాలపై ముఖ్య నేతలతో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ నెల 19న మళ్లీ సమావేశం అనంతరం సీఎంను కలవాలని ఇద్దరు ఎమ్మెల్యేలు, కన్నబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top