గుడి చుట్టూ రాజకీయం !
వివాదాలకు కేంద్రంగా దువ్వ దానేశ్వరి ఆలయం
చక్రం తిప్పుతున్న టీడీపీ నేతలు
ఉత్సవ విగ్రహంలా పాలకవర్గం
ఆలయ ఈవోపైనా అవినీతి ఆరోపణలు
పశ్చిమగోదావరి, తణుకు: జిల్లాలోనే పేరొందిన తణుకు మండలం దువ్వలో దానేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏటా రూ. కోటికి పైగా ఆదాయం వస్తుంది. జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందుతుంటారు. ఇటీవల అమ్మవారి ఆలయం చుట్టూ రాజకీయ క్రీనీడలు చుట్టుకున్నాయి. దేవస్థానం వ్యవహారాల్లో అధికార పార్టీ నేతలు జోక్యం పెరగడంతో ఇటీవలి కాలంలో నిత్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు ఆలయ కార్యనిర్వహణాధికారితోపాటు కింది స్థాయి సిబ్బందికి, పాలకవర్గానికి మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఈ క్రమంలోనే దువ్వ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పెత్తనం చెలాయిస్తుండటం అటు గ్రామస్తులకు, ఇటు పాలకవర్గానికి మింగుడు పడటంలేదు.
అనధికార కమిటీ పేరుతో పెత్తనం
దువ్వలోని దానేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సుమారు 17 నెలల క్రితం చైర్మన్ శిరిగిశెట్టి కలికిమూర్తితో పాటు కొందరు సభ్యులతో ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచీ టీడీపీ నాయకులు ఆలయంపై పెత్త నం చెలాయిస్తుండటం విమర్శలకు దారి తీస్తోం ది. ఇటీవల గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గిద్ధా ధనరాజు అధ్యక్షుడిగా అభివృద్ధి కమిటీ పేరుతో మరో అనధికార కమిటీని ఏర్పా టు చేశారు. గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేరుతో కమిటీ ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై పాలకమండలి తీవ్ర అ«భ్యంతరం తెలియజేసింది. దేవా దాయశాఖ ఆధీనంలో కొనసాగుతున్న పాలకమండలి కాకుండా వేరే అనధికార కమిటీ నియమించడం ఏంటని ఎమ్మెల్యే వద్ద పంచాయతీ పెట్టారు. తక్షణమే అనధికార కమిటీను రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వద్ద ఉండాల్సిన చెక్కు బుక్కు గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు గిద్ధా ధనరాజు తన వద్ద ఉంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి సంబం ధించి ఎలాంటి చెల్లింపులు చేయాలన్నా ఆలయ ఈవో సదరు టీడీపీ నేత ఇంటికి వెళ్లి మరీ చెక్కుపై సంతకం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. దేవస్థానం అభివృద్ధి కోసం ట్రస్టుబోర్డు ఎలాంటి తీర్మానం చేసినా తుది నిర్ణయం టీడీపీ నేతదే కావ డం పాలక మండలికి మింగుడు పడటంలేదు.
అవినీతిమయం
దానేశ్వరి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారిగా చాగంటి సురేష్నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేవస్థానంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందని పాలక మండలి సభ్యులతోపాటు, కింది స్థాయి సిబ్బంది బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం విశేషం. దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీలో నాశిరకం నూనెలు వాడుతూ పాలకవర్గం నిర్ణయం లేకుం డానే ధరను రూ. 15 పెంచడంతోపాటు బరువు తగ్గించేయడం అప్పట్లో తీవ్ర దుమారాన్నే రేపింది. గతంలో రూ. 10 ఉండే లడ్డూను ధర పెంచి తూకం తగ్గించడంతోపాటు నాశిరకం నూనెలు వాడేందుకు అనుమతి ఇచ్చినందుకు కాంట్రాక్టరు నుంచి సంబంధిత దేవస్థానం అధి కారం రూ.1.50 లక్షలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఆలయానికి వచ్చే వాహనాలకు దూపం వేసేందుకు అనధికారికంగా వేలం పాట నిర్వహించి పాటదారుడి నుంచి రూ. 40 వేలు వసూలు చేసిన సంఘటన చర్చనీయాశమైంది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో వేలంపాటను రద్దు చేశారు. ఇదిలా ఉంటే ఈవో సురేష్నాయుడు తన సమీప బంధువు ఏలూరు పత్తేబాద కనకదుర్గ ఆలయంలో గుమాస్తాగా పనిచేసిన వ్యక్తిని దానేశ్వరి అమ్మవారి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సదరు వ్యక్తిపై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పాటు నకిలీ రసీదులతో లక్షలాది రూపాయల నగదు, భారీగా వెండి, బంగారు ఆభరణాలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గతంలో భీమవరం, గునుపూడి ప్రాంతాల్లో పని చేసిన ప్రస్తుత ఈవో సురేష్నాయుడిపైనా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వ్యక్తిని దానేశ్వరి ఆలయ ఈవోగా నియమించిన నాటి నుంచి అవినీతి ఆరోపణలు మరింత పెరిగాయనే ఆందోళనభక్తుల్లో నెలకొంది.
చర్యలు తీసుకుంటాం
దేవస్థానంలో ఎలాంటి అవినీతికి పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ఫిర్యాదులు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి చర్యలు తీసుకుంటాం.– దుర్గాప్రసాద్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఏలూరు
మరిన్ని వార్తలు