వేగంగా పోస్టుల భర్తీ

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందిని వెంటనే తీసుకోండి

కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్‌ ఉన్న పడకల సంఖ్య పెంచండి

కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

రైలు, విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి

ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ప్రజలు వస్తారు

కోవిడ్‌ వైద్య సదుపాయాలపై క్షేత్రస్థాయి వ్యవస్థ బలోపేతం చేయాలి

ఫోన్‌ చేయగానే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకునే పరిస్థితి ఉండాలి

హైరిస్క్‌ ఉన్నవారు ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి

వైరస్‌ లక్షణాలుంటే పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.. దీనిపై అవగాహన కల్పించాలి

వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.. అన్నీ భర్తీచేయాలి. సరిపడా సిబ్బంది ఉంటేనే విపత్తులను ఎదుర్కోగలం. వైరస్‌ రావటం నేరమూ కాదు.. పాపమూ కాదు. వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష సరికాదు. కరోనా ఎవరికైనా సోకవచ్చు. వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం.. అంతం చేస్తాం లాంటి మాటలకన్నా వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి. అలా చేయకపోతే నష్టం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందిని వెంటనే భర్తీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎనిమిది జిల్లాల్లోని కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న ఐసోలేషన్, ఆక్సిజన్‌ సదుపాయాలున్న పడకల సంఖ్యను కూడా మరింత పెంచాలన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలుంటే పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కనీస జాగ్రత్తలు, వైద్య సహాయంతో కోలుకోవడం సులభం అవుతుందని చెప్పారు. కరోనా సోకడం నేరం, పాపం కాదని.. దానిపట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని, వైరస్‌ ఎవరికైనా వ్యాపిస్తుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. వైరస్‌ సోకిందని అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్‌ చేయాలి? వైద్య సదుపాయం ఎలా పొందాలన్న దానిపై క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలన్నారు.

ఇందుకోసం డోర్‌ లెవల్‌ రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఫోన్‌ చేయగానే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకునే పరిస్థితి ఉండాలని స్పష్టంచేశారు. హైరిస్క్‌ ఉన్న వారు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా మరణాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రజలకు బాగా తెలియజేయాలని.. ఈ మేరకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన ఆదేశించారు. రిస్క్‌ ఉన్న వ్యక్తులు వైద్యం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందనే అంశాన్ని కూడా వివరించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. రైలు సర్వీసులు, విమాన సర్వీసులు ప్రారంభం అవుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ప్రజలు రావడం మొదలవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి..

ఖాళీల భర్తీ వేగంగా జరగాలి
కోవిడ్‌–19 నివారణలో భాగంగా రాష్ట్రంలో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవడం.. సరిపడా సిబ్బందిని నియమించుకోవడం అత్యంత ముఖ్యమైన అంశాలు. ఏ ఆస్పత్రిలోనైనా వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.. అన్ని ఖాళీలూ భర్తీచేయాలి. సరిపడా సిబ్బంది ఉంటేనే ఇలాంటి విపత్తులను ఎదుర్కోగలం.  
► పీహెచ్‌సీల్లో వైద్యుల సంఖ్యను పెంచడం.. వారిలో కొందరికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ను కేటాయించడం వరకూ మనం వెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్‌ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు
► అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న ఐసొలేషన్, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అలాగే, సీఎం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి, వైజాగ్, చిత్తూరు జిల్లాల్లో పీహెచ్‌సీల స్థాయిలోనే టెస్టింగ్‌ శాంపిళ్ల సేకరణ సదుపాయాలను కల్పించనున్నామని తెలిపారు. దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తామని అధికారులు వెల్లడించారు. 
► విమానాల రాకపోకలు ప్రారంభం అవుతున్నందున ప్రయాణికుల నుంచి శాంపిల్‌ తీసుకుని, వారిని హోం క్వారంటైన్‌కు సూచిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. వారి వివరాలు తీసుకుని పర్యవేక్షిస్తామన్నారు.
► కనీస జాగ్రత్తలు పాటించేలా వారికి తగిన సూచనలు చేసి అవి పాటించేలా చూస్తామన్నారు.
సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

డోర్‌ లెవల్‌ రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ తయారుచేయండి
► కోవిడ్‌ వచ్చిందని అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్‌ చేయాలి? ఎలా వైద్య సదుపాయం పొందాలన్న దానిపై క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం డోర్‌ లెవల్‌ రిపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ తయారుచేయండి.
► పరీక్షల కోసం ఎవరిని సంప్రదించాలి? ఎవరికి ఫోన్‌చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? ఇందుకు ఎవరి సహకారం తీసుకోవాలి? ఐసోలేషన్‌ ఎలా పాటించాలి? తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవస్థను రూపొందించండి.
► ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ఈ విధానం ఉండాలి.
► అలాగే, ఫోన్‌ చేయగానే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకునే పరిస్థితి ఉండాలి.
► 104, ఆరోగ్యం, వైద్యం అందించే అంబులెన్స్, 14410 టెలిమెడిసిన్‌ లేదా ప్రజాసమస్యల కోసం ఉద్దేశించిన 1902 లాంటి నంబర్లకు ఫోన్‌చేసినా వెంటనే సంబంధిత వ్యక్తికి పరీక్షలు చేయడం, వైద్యం అందించడం లాంటి ప్రక్రియలు సాఫీగా సాగేలా సమర్థ యంత్రాంగాన్ని నిర్మించాలి.
► హైరిస్క్‌ ఉన్నవారు ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా మరణాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందనే విషయంపై విస్తృత ప్రచారం కల్పించాలి.
► రిస్క్‌ ఉన్న వ్యక్తులు వైద్యం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందనే అంశాన్నీ తెలియజేయాలి.

వైరస్‌ రావడమన్నది నేరమూ కాదు.. పాపమూ కాదు 
► కరోనా ఎవరికైనా సోకవచ్చు. దీర్ఘకాలంలో దీనితో పోరాటం చేయాల్సి ఉంటుంది.
► వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం.. అంతంచేస్తాం లాంటి మాటలకన్నా వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి. అలా చేయకపోతే నష్టం కలుగుతుంది.
► వైరస్‌ రావడమన్నది నేరమూ కాదు.. పాపమూ కాదు. వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపడం కూడా సరికాదు.
► వైరస్‌ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాం? ఏ రకంగా సన్నద్ధంగా ఉంటున్నామన్నదే కోవిడ్‌ నివారణలో అత్యంత ముఖ్యమైన అంశం.
► కోవిడ్‌ వైరస్‌ విషయంలో వాస్తవాలను విస్మరించే కొద్దీ తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని గుర్తించాలి.
► అందుకే చిట్టచివరి స్థాయిలో మనం ఏర్పాటు చేయదలుచుకున్న విలేజ్‌ క్లినిక్స్‌ ఇలాంటి మహమ్మారులను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top