46 అంతస్తులతో సీఎం టవర్..
రాజధానిలో సచివాలయం తుది ఆకృతులు
సీఆర్డీఏ సమావేశంలో ‘ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్’ ప్రజెంటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో 46 అంతస్తులతో సీఎం టవర్, అందులో సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉండేలా డిజైన్ రూపొందించారు. గురువారం సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబుకు ‘ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్’ ప్రతినిధులు సచివాలయం తుది ఆకృతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం టవర్ పైభాగాన హెలీప్యాడ్ ఉండేలా డిజైన్ చేశారు. ఈ టవర్ చెంతనే సీఎస్ టవర్ ఉండేలా డిజైన్లు ఇచ్చారు. ఐదు టవర్లుగా నిర్మించనున్న సచివాలయం భవంతులు పాలవాగుకు రెండువైపులా ఉండేలా డిజైన్లు రూపొందించారు.
ఒక్కొక్క టవర్ 40 అంతస్తులు ఉండనుంది. ఇందులో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. 5 టవర్లకు చెంతనే ఫుడ్ ఫ్లాజాలు, స్పోర్ట్స్ ఏరియా, ఇతర సౌకర్యాల కోసం విడిగా నిర్మాణాలను రెండంతస్తులుగా నిర్మించనున్నారు. అన్ని టవర్లను కలుపుతూ 600 మీటర్ల మేర అంతర్గత మార్గం ఉండేలా డిజైన్ రూపొందించారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో అమరావతిలో జరిగే సంతోష నగరాల సదస్సు ఏర్పాట్లపై సీఆర్డీఏ సమావేశంలో సీఎం సమీక్షించారు.