అలిపిరిలో నాపై దాడి జరిగినప్పుడు..
వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారు: చంద్రబాబు
సాక్షి, కర్నూలు: ‘నేను రాయలసీమలోనే పుట్టాను.. ఆ రోజుల్లో నాపై అలిపిరిలో దాడి జరిగినప్పుడు ఆ తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టి నాతో రాష్ట్ర అభివృద్ధికి పని చేయిస్తున్నాడ’ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నంద్యాల మార్కెట్ యార్డులో పొదుపు సంఘాల మహిళలతో మంగళవారం సీఎం ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నంద్యాలలో అపెరల్ పార్కు ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అలీప్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రజల సహకారం తన జీవితంలో మరిచిపోలేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నంద్యాలలో అందరికీ ఇళ్లు త్వరలో సాకారం అవుతాయని, ఎన్నికల్ని రాజకీయ కోణంలో చూడటం లేదని చెప్పారు. అన్ని రిజర్వాయర్లను నింపితే రెండుమూడేళ్లయినా కరవును ఎదుర్కోవచ్చన్నారు. తాము అనర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, మండలి చైర్మన్ ఫరూక్, ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.