నువ్వు తెలివైనవాడివైతే... నీకన్నా తెలివైనోణ్ని
సాక్షి, అమరావతి: ‘నువ్వు తెలివైన వాడివైతే.. నీకంటే నేను ఇంకా తెలివైన వాడిని..’ అని సోమవారం జల సంరక్షణ కార్యక్రమం సందర్భంగా తన సమస్య గురించి ప్రస్తావించిన ఓ వ్యక్తిని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నీరు – ప్రగతిలో భాగంగా రెండో దశ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే కృష్ణా జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి మాట్లాడుతూ ‘టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణ కాదు.. జనానికి రక్షణ కరువైంది’ అని పేర్కొనటంతో కలకలం రేగింది. మందడం గ్రామానికి చెందిన మాదల సుబ్బయ్య అనే వ్యక్తి కుమారుడు తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఎం వద్ద వాపోయారు. సీఎం కల్పించుకుని రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన సమస్య గురించి ఎస్పీకి చెబుతానంటూ సీఎం నిష్క్రమించారు.