మీ పెట్టుబడులకు... నాదీ భరోసా: సీఎం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సుస్థిరతకు ఢోకా లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఆరో రోజు సోమవారం ఆయన అబుదాబీలో పర్యటించారు. అబుదాబీలో ఐబీపీజీ, ఐసీఏఐల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ రోడ్ షోలో మాట్లాడారు. ఇన్వెస్టర్లు నమ్మకంతో తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. మీ పెట్టుబడులకు నాది భరోసా అని హామీ ఇచ్చారు. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) బోర్డు డైరెక్టర్ ఖలీల్ ఫౌలాతి, కార్యనిర్వాహక వర్గం అత్యున్నత స్థాయి సభ్యులతో చంద్రబాబు చర్చలు జరిపారు.
ఏపీలో ఎక్కువ భాగం పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరగా ఏడీఐఏ సుముఖత వ్యక్తం చేసింది. పెట్టుబడుల కంపెనీ ముబదాల ప్రతినిధులతోనూ బాబు సమావేశమయ్యారు. తమ రాష్ట్ర సందర్శనకు రావాలని సీఎం కోరగా హోమిత్ అల్ షిమ్మరీ అంగీకరించారు.