సంక్షేమ పథకాల అమల్లో రాజీ పడం! : సీఎం
సాక్షి, అమరావతి : సంక్షేమ పథకాల అమల్లో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం శాసనసభలో సంక్షేమ పథకాల అమలుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెళ్లి కానుక కింద బీసీలకు రూ.35 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీ, మైనార్టీలకు రూ.50 వేలు అందిస్తామని చెప్పారు. పెళ్లికి ముందు 20 శాతం, పెళ్లి రోజున 80 శాతం నగదును వారి అకౌంట్లలో జమ చేస్తామన్నారు. భవిష్యత్లో విద్యుత్తు చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. వెనుకబడిన వర్గాలకు ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే సంక్రాంతి నుంచి సగం ధరకే చేనేత చీర, ధోవతి ఇస్తామన్నారు.
త్వరలో హిజ్రాలకు రూ.వెయ్యి పింఛన్ అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేశాకే ఎన్నికలకు వెళతామన్నారు. డిసెంబర్ 3న తాను కొరియా వెళుతున్నానని, మరోసారి ఇన్వెస్టర్ మీట్ పెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగానే నిరుద్యోగ భృతిపై నూతన విధానం తీసుకువస్తామని ప్రకటించారు. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఎంసీఐ, కేంద్రంతో మాట్లాడానని చెప్పారు. కాగా, ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటూ శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేశారు.