కుబేర కార్మికులను కాపాడన్నా..
జగన్కు సిగరెట్ ఫ్యాక్టరీ కార్మికుల వినతి
అంబాజీపేట: వారసులకు ఉపాధి కల్పించాలన్నా.. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కుబేర ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని కోరారు. బిక్కవోలులో శనివారం ప్రజా సంకల్పయాత్రలో ఆయనకు వారు ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బిక్కవోలు కుబేర సిగరెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల స్థానంలో వారి వారసులను విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని విశాఖపట్నం లేబర్ కోర్టు 2017లో తీర్పు ఇచ్చిందన్నారు.
ఈ తీర్పు అమలుకు యాజమాన్యం కుంటిసాకులు చెబుతోందని వారు వాపోయారు. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చి స్థానిక కార్మికుల పొట్ట కొడుతున్న యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి స్థానిక కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. కోర్టు తీర్పు అమలు చేయించి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయనను యూనియన్ ప్రధాన కార్యదర్శి టీవీవీ ప్రసాదరావు, నక్కల రామారావు, పి.రాధాకుమార్, సబ్బితి రామిరెడ్డి, కె.నూకరాజు తదితరులు కోరారు.