సన్మానిస్తారా.. తొలగించమంటారా..?
సీఎం సన్మానానికి రావాల్సిందిగా అంగన్వాడీలకు ఆదేశం
లేదంటే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపులు
కేంద్రాల్లో పిల్లలను వదిలేసి వెళ్లిన అంగన్వాడీలు
జీతాల పెంపు తమ పోరాటాల ఫలితమంటున్న వర్కర్లు
కందుకూరు అర్బన్: జీతాలు పెంచాం.. సన్మానించండి అంటూ ఇటీవల వీఆర్ఏలను రాజధానికి రప్పించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా అంగన్వాడీ కార్యకర్తలకూ అదే ఆదేశాలు జారీ చేశారు. తమ వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రిని సన్మానించే కార్యక్రమం కోసం జిల్లా నుంచి అంగన్వాడీ సిబ్బంది ఇష్టం లేకున్నా బలవంతంగా గురువారం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
పోరాటాల ఫలితమిది..
చేసి కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని అంగన్వాడీలు అనేక పోరాటాలు చేశారు. నాలుగేళ్లలో అనేక సార్లు తమకు జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఉద్యమాలు చేసినా సీఎం పట్టించుకోలేదు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు రూ.7 వేల నుంచి రూ.10,500కు, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6 వేలకు వేతనాలు పెంచారు. సీఎం రాకపోతే ఉద్యోగాలను పీకేస్తామని ఉన్నత స్థాయి అధికారులు, అధికార పార్టీ నాయకులు హెచ్చరికలు జారీ చేయడంతో చేసేది లేక పంటి బిగువున కోపాన్ని భరిస్తూ విజయవాడకు వెళ్లారు. విజయవాడ వెళ్లిరావటానికి గానూ ఒక్కొక్కరికి రూ.40 ఇస్తానని అధికారులు చెప్పినట్లు కొందరు అంగన్వాడీ కార్యకర్తలు చెప్పటం గమనార్హం.
ముఖ్యమంత్రి చంద్రబాబు తమకేమీ ఉదారంగా వేతనాలు పెంచలేదని, ఇది ఏళ్ల తరబడి పోరాటాల ఫలితమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ధర్నాలు నిర్వహించిన తమను గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోలేదని చెప్పడం గమనార్హం. జిల్లాలోని పలు పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యాసంస్థల వాహనాలలో సిబ్బందిని తరలించడానికి ఇతోధిక సాయం చేసి తమ స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారు. ప్రజాధనాన్ని వృథాచేసి చిరుద్యోగులతో సీఎం సన్మానాలు చేయించుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.