హోదాపై కప్పదాట్లు!

Chandrababu has different attitudes on the ap special category status - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు భిన్న వైఖరులు

హోదాతో ఏమొస్తుంది?.. అదేమైనా సంజీవనా? అంటూ ఎగతాళి

హోదా ఆకాంక్షను యువభేరీలు, ప్రజా ఉద్యమాలతో సజీవంగా ఉంచిన ప్రతిపక్ష నేత జగన్‌ 

ఎన్నికల ముంగిట నేడు ఢిల్లీలో సీఎం హోదాలో దీక్షకు బాబు సిద్ధం  

సాక్షి, అమరావతి: ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు...’ అని ఎలుగెత్తి నినదించిన గొంతులను దారుణంగా నొక్కేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల ముందు విభజన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో ఒక రోజు దీక్షకు ఉపక్రమించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని తిరుపతిలో నిర్వహించిన సభలో మోదీ, పవన్‌ కల్యాణ్‌ సాక్షిగా డిమాండ్‌ చేసిన చంద్రబాబు అనంతరం అధికారం చేపట్టాక ‘హోదా అంటే జైలుకే...’ అని బెదిరించారు. ఎన్నికలు కాగానే మాట మార్చేసి హోదాతో ఏమొస్తుంది? అదేమైనా సంజీవనా? ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఉన్నా ఏం బావుకున్నాయి? అని ప్రశ్నించారు.

హోదా కోసం రాష్ట్రమంతా బంద్‌లు, నిరసనలకు దిగితే పోలీస్‌స్టేషన్లు, జైళ్లను ఉద్యమకారులతో నింపేశారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ చాలంటూ కేంద్రం ఎదుట సాగిలపడ్డారు. హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏముందన్నారు. ఓటుకు కోట్లు కేసు, రాజధాని పేరుతో భూ కుంభకోణాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలతో విభజన హామీలను నెరవేర్చాల్సిందిగా కేంద్రాన్ని గట్టిగా అడిగేందుకు చంద్రబాబు సాహసించలేదు. ఇప్పుడు పదవీకాలం ముగింపు దశలో ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసి హోదా కావాలంటూ మభ్య పెట్టేందుకు ఢిల్లీలో దీక్షకు సిద్ధమయ్యారు.

మోదీని కీర్తిస్తూ అసెంబ్లీలో బాబు తీర్మానాలు
ప్యాకేజీతో రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా మోదీకి కృతజ్ఞతలు తెలియచేస్తూ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘జయహో... మోదీ’  అంటూ తీర్మానాలు చేయించి మరీ కీర్తించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఫలితంగా ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాయే ఉండదని అసెంబ్లీ సాక్షిగా బొంకారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికీ, ఆర్థిక సంఘానికీ సంబంధమే లేదని.. ప్రధాని జారీ చేసే ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ చాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలను వెల్లడించినందుకు ఆయన్ను హేళన చేశారు. అసెంబ్లీలోనూ, బయటా ముప్పేట దాడికి దిగారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌కు పాతరేసే యత్నం చేశారు. అయితే ఎన్ని చేసినా ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే ప్రజల ప్రబల ఆకాంక్ష ముందు సీఎం చంద్రబాబు తలవంచక తప్పలేదు. వైఎస్‌ జగన్‌ హోదా కోసం మడమ తిప్పకుండా పోరాడటం, రాష్ట్రవ్యాప్తంగా యువభేరీలు నిర్వహించి హోదా కాంక్షను సజీవంగా ఉంచడం, ప్రజల్లో ఉద్యమ జ్వాల ఎగసిపడటంతో గత్యంతరం లేక చంద్రబాబు మాట మార్చారు. ప్రజా ఉద్యమాలు, ఎన్నికలు సమీపించడంతో ప్రత్యేక హోదా కావాలంటూ  చంద్రబాబు ‘యూటర్న్‌’ తీసుకున్నారు. ఐదేళ్లు కాలయాపన చేసిన చంద్రబాబు పదవీ కాలం ముగింపు ఘడియల్లో ప్రత్యేక హోదా కావాలంటూ ఢిల్లీలో కంటి తుడుపుగా ధర్మ పోరాట దీక్ష పేరుతో నిరసనకు దిగనుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగున్నరేళ్లు హోదా గురించి పట్టించుకోకుండా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు యూటర్న్‌ తీసుకుని మరోసారి వంచించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే తాజాగా ఢిల్లీలో చేపడుతున్న దీక్ష అని పేర్కొంటున్నారు.

కేంద్రంలో నాలుగేళ్లు కొనసాగి ఏనాడైనా అడిగారా?
అవకాశవాదానికి మారు పేరైన చంద్రబాబు ప్రత్యేక హోదాపై వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు ప్రజల చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో అంటకాగిన ఆయన ఏనాడైనా ప్రత్యేక హోదా కావాలని ఒత్తిడి చేశారా? కనీసం ఒక్కసారైనా కేంద్రాన్ని గట్టిగా అడిగారా? అని ప్రశ్నిస్తున్నారు. విభజనతో అన్నివిధాలా దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే మేలు జరుగుతుందని ప్రజలు, ప్రతిపక్షం  నినదిస్తే... అదేమైనా సంజీవనా? అంటూ చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడటాన్ని ఎవరూ మర్చిపోలేదని పేర్కొంటున్నారు. హోదాపై యూటర్న్‌ ఎలా తీసుకున్నారు? అనే అంశాలను పరిశీలిస్తే ఆయన పోరాటంలో చిత్తశుద్ధి ఎంటో అర్థం అవుతుందన్నారు. 

పార్లమెంట్‌ తొలి భేటీలోనే హోదా కోసం వైఎస్సార్‌ సీపీ పట్టు...
2014 ఎన్నికల ప్రచార సభలో తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రధాని మోదీ, తన పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో ఏపీకి ఐదేళ్లు కాదు.. 15 ఏళ్లు  ప్రత్యేక హోదా కావాలి, మేం అధికారంలోకి వస్తే హోదాను సాధిస్తాం అని నమ్మబలికిన చంద్రబాబు ఎన్నికల అనంతరం ఆ ఊసే మరిచారు. హోదా గళాలను అణిచివేశారు. ఎన్నికలు ముగిశాక తొలి పార్లమెంట్‌ సమావేశాల్లోనే (12.06.2014) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైఎస్సార్‌ సీపీ ఎంపీలు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు సందర్భాల్లో హోదా ఆవశ్యకతను యావత్‌ దేశానికి తెలిసేలా చేశారు. అందివచ్చిన ప్రతి వేదికపైనా వైఎస్సార్‌ సీపీ హోదాపై ఎలుగెత్తి చాటుతూ వచ్చింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 2015 జూన్‌ 3వతేదీన గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన తరువాత హోదా ఉద్యమ వేడి రాజుకుంది. అప్పటినుంచి ఏ దశలోనూ పట్టు విడవకుండా జగన్‌ పోరాడటంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పలేదు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టి మౌనంగా ఉన్న చంద్రబాబు వివిధ సందర్భాల్లో ఎలా అవకాశవాదం ప్రదర్శించారో ఆయన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలివీ...
ఏప్రిల్‌ 29, 2014 : (తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా జరిగిన ఎన్నికల సభలో...) మనకు ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామంటున్నారు. ఐదేళ్లు, పదేళ్లు కాదు, 15 ఏళ్లు ఇవ్వండి అని మోదీగారిని కోరుతున్నా.
02.06.2015 : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు (ఎన్నికలు ముగిశాక విజయవాడ నవనిర్మాణ దీక్షలో)
ఆగస్టు 25, 2015 : ప్రత్యేక హోదా ఏమీ సంజీవిని కాదు, న్యూఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత చంద్రబాబు వ్యాఖ్య.
12.08.2015 : హోదాతోనే అన్నీ రావు. కోడలు మగ పిల్లాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?(విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో...)
18.05.2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వక పోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
19.05.2016: హోదాతోనే అంతా కాదు. అదేమీ సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధానికి విన్నవించా...
08.09.2016: మనకు ప్రత్యేక హోదా వీలు కాదన్నారు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం?
09.09.2016: ప్రత్యేక హోదా ఇవ్వలేం. కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలను లెక్కించి ఆ మేరకు నిధులిస్తామని అరుణ్‌జైట్లీ చెప్పారు. వారు ఇచ్చింది తీసుకుంటాం. అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతాం.
10.09.2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించొద్దని కోరుతున్నా.
11.09.2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం. కేంద్రం చెప్పిన దాని కన్నా అదనంగా ఏం వస్తాయో చెప్పమనండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్రాలు అభివృద్ధి చెందలేదు. 
18.09.2016: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా... 
దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. 
23.09.2016: హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం.
26.09.2016: హోదా అంటే జైలుకే...! బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విద్యార్థుల తల్లి దండ్రులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక.
05.10.2016: కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే రాబట్టాలని చూస్తా. 
ప్రత్యేక హోదాలో వస్తున్నవన్నీ ఇస్తున్నందుకే ప్యాకేజీని ఒప్పుకున్నాం. 
29.10.2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు.
04.02.2017: హోదా వేస్ట్‌. హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 
17.03.2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు, ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తున్నాం. 
06.06.2017: ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు ఏమిటి? అదనంగా వచ్చేదేమిటి? ప్యాకేజీకి, ప్రత్యేక హోదాకు వ్యత్యాసం ఏమిటి? ప్యాకేజీలో లేనిదేంటి?
 నేను దేశంలో సీనియర్‌ నేతను. నేను ఎవరికీ భయపడాల్సిన పని లేదు. 
27.02.2017: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని 
కొందరు మభ్య పెడుతున్నారు. 
02.03.2018: పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 
ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులున్నాయి. 

బాబు యూటర్న్‌ ఇదిగో...
06.03.2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నదే మన డిమాండ్, ఎవరూ ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రస్తావన కూడా తేవద్దు. ప్రత్యేక హోదా గురించే అందరూ మాట్లాడాలి. 
08.03.2018 : కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు. 
10.03.2018 : వైఎస్సార్‌ సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వం.
15.03.2018 : వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొందరు కావాలనే కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నారు. 
16.03.2018 : మేమే కేంద్రంపై అవిశ్వాసం పెడతాం. వైఎస్సార్‌ సీపీ తీర్మానానికి మద్దతు ఇవ్వం. 
24.03.2018 : హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు ఇచ్చినా మాకు ఓకే.
2018 మే : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 
21.07.2018 : ప్రత్యేక హోదాకు బదులుగా నేను ఎప్పుడూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించలేదు.
25.07.2018 : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి.
18.09.2018 : ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తాం.
20.09.2018: ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం.
11.10.2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.

నాడు మోదీని కీర్తిస్తూ... నేడు నిందిస్తూ
మార్చి 16, 2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు అసెంబ్లీలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన చంద్రబాబు
మార్చి 16, 2017: ప్రపంచంలో అత్యుత్తమ ప్రధాని మోదీ. ఆయన్ను మించిన వారు లేరు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు.
జులై, 2017: మళ్లీ మోదీయే ప్రధానిగా రావాలి. మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో తీర్మానం ప్రవేశపెట్టిన చంద్రబాబు. 
డిసెంబర్‌ 12, 2018: మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీపై  వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మోదీ గద్దె దిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నా. టీడీపీ నాయకులతో చంద్రబాబు వ్యాఖ్య. 
డిసెంబర్‌ 16, 2018: దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారు. నా జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. 
జనవరి 20, 2019 : మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారు. మోదీని సాగనంపేంతవరకూ నిద్రపోకూడదు. (కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు వ్యాఖ్య)
ఫిబ్రవరి 9, 2019: మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారు? మోదీ పర్యటన ఏపీకి చీకటి రోజు, దుర్దినం. ఆయన పర్యటించే రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top