చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యం

Chandrababu Did Nothing For Polavaram Project - Sakshi

చంద్రబాబు పాలనలో పడకేసిన పోలవరం 

రెండేళ్లలో పూర్తికి రివర్స్‌ టెండరింగే శరణ్యం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను వేగిరం చేయడంతో పాటు అందుకు అవసరమైన అనుమతులు సాధించడంలోనూ  గత చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యం. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రకటించి ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చినప్పటికీ సకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయించడంలో చంద్రబాబు విఫలం కాగా, నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలు కూడా మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే చందంగా పనులు సాగించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ పనులను రద్దు చేసి మళ్లి టెండర్లు (రివర్స్‌ టెండరింగ్‌) పిలవడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్చనీయాంశం అయ్యారు. రాష్ట్రంలో నిర్మాణ, మౌళిక వసతుల రంగాలు తిరోగమనంలో ఉన్నాయని అటువంటి పనులు చేపట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు లేకపోగా ప్రతీకూల పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ ఓ వైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
 
బాబు పాలనలో సా...గిన పోలవరం
ఈ నేపథ్యంలో పోలవరం పనులు సాగుతున్న తీరును పరిశీలిస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌ ఆది నుంచి వివాదాలతో నత్తనడకన సాగుతుండగా అన్ని అనుమతులు లభించిన తరువాత కూడా చంద్రబాబు పాలనలో మరింతగా ప్రాజెక్ట్‌ పడకేసింది. 2018 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి గ్రావిటీ పద్ధతిలో కుడి, ఎడమ కాలువ ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామనే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించినప్పటికీ 2019 డిసెంబర్‌ నాటికి కూడా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కనీసం మరో రెండేళ్ళ సమయం పడుతుంది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితేనే.
 
ఇప్పుడున్న నిర్మాణ సంస్థలు అందుకు తగిన విధంగా వేగంగా పనులు చేపట్టే శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం మేలైన సంస్థలకు తక్కువ ధరకే పని అప్పగించేందుకు నిర్ణయించడం వల్లనే కాంట్రాక్ట్‌ను రద్దుచేసి రివర్స్‌ టెండరింగ్‌లో భాగంగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతా అనుకున్నట్లు సెప్టెంబర్‌ నాటికి పనిచేసే సంస్థ ఖరారైతే నవంబర్‌ నెలఖరి నుంచి మళ్లీ పనులు ప్రారంభించడం సాధ్యమవుతుంది. అప్పటికి గోదావరిలో ప్రవాహం పరిమితంగా ఉంటుంది.
 
అడ్వాన్స్‌ నిధులిచ్చినా పనులు నత్తనడక
పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధానమైనవి జలాశయ నిర్మాణంతో పాటు జల విద్యుత్‌ కేంద్రం. దీనిని సాంకేతిక భాషలో ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసిఆర్‌ఎఫ్‌) అని పిలుస్తారు. 2009లో ఈ పనులకు టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఆ ధరకు గిట్టుబాటు కావని ఎవరూ ముందుకు రాలేదు. 2012లో నాటి ప్రభుత్వం టెండర్లు పిలవగా ట్రాన్స్‌ట్రాయ్‌తో పాటు మరికొన్ని సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో తక్కువ ధరకు పనులు చేపట్టాయి. ఆ తరువాత ఆ సంస్థ దివాళా తీయడంతో అందులో కొంత పనిని తప్పించి వేరే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.  ఆ తరువాత మరో రెండు సంస్థలకు కూడా మరికొన్ని పనులను అప్పగించారు. కాంట్రాక్ట్‌ రద్దు అయ్యే నాటికి మొత్తం మూడు సంస్థలు పనులను చేస్తుండేవి.
 
ప్రాజెక్ట్‌లో కీలకమైన పనులు గత అయిదేళ్లలో ఏమాత్రం ముందుకు సాగలేదు. 2014లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి నిర్మాణ పనులకు అయ్యే వ్యయం మొత్తాన్ని భరిస్తోంది.  మొత్తం ప్రాజెక్ట్‌ చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 16673 కోట్లు వ్యయం చేయగా అందులో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన తరువాత 11537 కోట్లు ఖర్చు చేశారు. అంతకు ముందు వైయస్‌ పాలనలో 5135 కోట్లు ఖర్చు అయ్యింది.  కేంద్రం నుంచి పిపిఏ ద్వారా 6727 కోట్లు విడుదలయ్యింది. ఇంకా 4810 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కేంద్రం ప్రభుత్వం నిధులే కీలకమయినప్పటికీ పనులను పూర్తి చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయ్యింది.
 
కీలకమైన పనులన్నీ పెండింగ్‌లోనే
ఇంకా పనుల్లో 4 కోట్ల ఘనపు మీటర్ల మట్టి పని పూర్తికావాల్సి ఉంది. అదే విధంగా కీలకమైన కాంక్రీట్‌ పని 20 లక్షల ఘనపు మీటర్ల మేర నిర్మించాలి. ఇక స్ట్రక్చర్ల విషయానికి వస్తే 381 పూర్తికాగా 140 నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 208 ఇంతవరకు ప్రారంభించనే లేదు. ప్రధానంగా హెడ్‌వర్క్స్‌లో 4 ప్యాకేజీ పనులతో పాటు జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. మట్టిపనుల్లో డయఫ్రం వాల్‌, జట్‌గ్రౌటింగ్‌ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌, అప్రోచ్‌ ఛానెల్‌, పైలెట్‌ ఛానెల్‌, ఎడమ గట్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంక్రీట్‌ పనుల విషయానికి వస్తే స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్టిల్‌ ఛానెల్‌ మొదలైన కీలకమయిన పనులు పూర్తికావాల్సి ఉంది.
 
అధిక చెల్లింపుపై నిగ్గు తేల్చిన నిపుణుల కమిటీ...
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో విచారణ చేయించారు. ఆ కమిటీ విచారణ జరిపి పనులు అంతంత మాత్రంగానే జరగ్గా అందులో 2364.8 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఏఏ పద్దు కింద ఎంతెంత మొత్తం అదనంగా చెల్లించింది, కాంట్రాక్టర్ల పట్ల నాటి ప్రభుత్వం ఏ విధంగా ప్రేమ చూపించింది సోదాహరంగా వివరించింది. నాటి ప్రభుత్వం ఆ విధంగా అదనపు మొత్తాలు చెల్లించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి కాలేదు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన హెడ్‌వర్క్‌ పనులను నాలుగు ప్యాకేజీలుగా రెండు సంస్థలకు అప్పగించగా ఈ ఏడాది ఆగస్ట్‌ నాటికి మూడు ప్రధానమైన పనులు పూర్తి కావాలి. మరొక పని వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి కావాలి. కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. యుద్ధప్రతిపాదికన పనులు చేస్తేనే ఇంకా రెండేళ్ల సమయం పడుతుంది. ప్రధానమైన జల విద్యుత్‌ కేంద్రం పనులు ఇంతవరకు ప్రారంభించనే లేదు.
 
మొదలుకాని పనులకు అడ్వాన్స్‌లు
జల విద్యుత్‌ కేంద్రం 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధంగా 2017 జనవరి 9న టెండర్లు పిలవగా సంస్థలను ఖరారు చేసి ఒప్పందం కుదుర్చుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. 2017 డిసెంబర్‌ 20న ఒప్పందం కుదుర్చుకుని 322 కోట్లు అడ్వాన్స్‌ చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌లోని స్పిల్‌వే ఛానెల్‌తో పాటు ర్యాక్‌ఫిల్‌ డ్యామ్‌, కాఫర్‌ డ్యామ్‌, గేట్ల బిగింపు, జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో రద్దు చేసింది.
 
జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణం పనిని చేపట్టడంలో కాంట్రాక్ట్‌ పొందిన సంస్థలతో పాటు పని అప్పగించిన ఏపి జెన్‌కో, నీటిపారుదల శాఖ ప్రధాన జలాశయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ అందరూ ఒక్కరే అయినప్పటికీ పనులు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్షం వహించారు. అసలు పని చేపట్టేందుకు అవసరమైన స్థలం అప్పగించకపోయినప్పటికీ 787.20 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు జెన్‌కో చెల్లించడం కమిటీని విస్తుపరిచింది. అయినప్పటికీ పని ఏమాత్రం ముందుకు సాగలేదు. రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటే అన్ని పనులను ఒకే ప్యాకేజీ క్రింద ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తాజాగా రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో టెండర్లు పిలిచింది.

అనుమతులన్నీ వైఎస్సార్‌ పాలనలోనే
పోలవరం ప్రాజెక్ట్‌ 1941లో ప్రతిపాదించగా వివిధ వివాదాలతో మూలన పడింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసినా పని ప్రారంభించలేదు. చంద్రబాబు (1995 నుంచి 2004వరకు) అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌ ప్రతిపాదన రాగా నిధులు ఎక్కడివి, నీళ్లు ఎక్కడివి అంటూ ప్రశ్నించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే జలయజ్ఞం కింద పెద్దఎత్తున నాటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లను ఒక్కసారిగా చేపట్టి చరిత్ర సృష్టించారు. అందులో భాగంగా 2005లో పోలవరం పనులు ప్రారంభిస్తూ హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్‌ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు.  

మొత్తం 13 రకాల అనుమతులు అవసరం కాగా అందులో 10 అనుమతులు వైఎస్సార్‌ పాలనలోనే లభించాయి. కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులు, స్థల, జాతీయ వన్యప్రాణి, గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ అనుమతులు, సుప్రీంకోర్ట్‌ నుంచి పాపికొండల అభయారణ్య స్థల  మార్పిడి, కేంద్ర జలసంఘం నుంచి టీఏసి, ప్లానింగ్‌ కమీషన్‌ నుంచి పెట్టుబడి వ్యయం, అటవీ, పర్యావరణ శాఖ నుంచి తుది అనుమతులు మొదలైనవి 2005 నుంచి 2009 మధ్య కాలంలో లభించాయి. చంద్రబాబు పాలనలో అంటే 2017, 2019ల్లో టీఏసి రేస్‌ టూ, సవరించిన అంచనాల అనుమతులు మాత్రమే లభించాయి. దీనిని బట్టి ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన కీలకమైన అనుమతులు సాధించడంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. అంతా నాటి ముఖ్యమంత్రి (దివంగత) వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలంలోనే సాధ్యమైంది.
 
ఇక పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కీలకమైన యంత్రాంగాన్ని ముఖ్యంగా చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంతో పాటు అనుబంధ ఇంజనీరింగ్‌ వ్యవస్థను 2004 డిసెంబర్‌లోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఏర్పాటు చేశారు. ముంపు బాధితులకు పునరావాసం, పునర్‌నిర్మాణం (ఆర్‌ అండ్‌ ఆర్‌) పనుల కోసం ప్రత్యేక కమిషనర్‌ను నియమించారు. ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతో పాటు కేంద్రం నుంచి నిధులు సాధించడం కోసం 2009 మేలో సమగ్ర నివేదికను నాటి వైఎస్సార్‌ ప్రభుత్వం సమర్పించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top