పురిటి పేగుపై కాసుల కత్తి
సాక్షి, గుంటూరు : రాజధాని జిల్లా గుంటూరులో ధనార్జనే ధ్యేయంగా సాధారణ కాన్పయ్యే గర్భిణికి సైతం సిజేరియన్ చేస్తున్నారు. ఇటీవల గుంటూరులో పర్యటించిన హెల్త్ రీఫామ్స్ కమిటీ ఎక్స్పర్ట్ వైద్య నిపుణులు సైతం ఇదే విషయాన్ని వైద్యాధికారులతో సమీక్షలో వెల్లడించారు. చాలా వరకు ఆపరేషన్లతో పని లేకుండా సాధారణ కాన్పులే జరుగుతాయి. కానీ వైద్యాధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా దృష్టి సారించకపోవటంతో గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతూ ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాన్పులు ఎక్కువ...
ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిల్లోనూ ఆపరేషన్లే అధికం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 నుంచి 20 శాతం మాత్రమే ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాలి. కానీ ఇదెక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల లక్ష్యాలను ఆరోగ్య కేంద్రాలు చేరుకోవడం లేదు. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
అధిక మొత్తంలో ఫీజులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసవంతోపాటు వెయ్యి రూపాయల వరకు పారితోషికం ఇస్తారు. ఉచితంగా రవాణా ఖర్చులు సైతం అందిస్తారు. పుట్టిన బిడ్డకు దోమ తెర, బేబీ బెడ్, చేతులు శుభ్రం చేసుకునే ఆయిల్, టవల్తో కూడిన బేబీ కిట్ను ఇస్తారు. బేబీకి వ్యాక్సిన్లు సైతం ఉచితంగానే వేస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇవేమీ ఉచితంగా ఇవ్వరు. సాధారణ కాన్పునకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సిజేరియన్కు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తారు. కాన్పు కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలి. కానీ డబ్బు కోసం అన్ని కేసుల్లోనూ ఆపరేషన్లు చేస్తున్నారు.
అవసరమైతేనే ఆపరేషన్లు
వైద్యుల్లో అధిక శాతం మంది సాధారణ కాన్పు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని సార్లు పురిటి నొప్పుల బాధలు తట్టుకోలేక గర్భిణులు. వారి కుటుంబ సభ్యులు కోరితే సిజేరియన్ చేస్తున్నాం. గర్భంలో కవలలు ఉన్నప్పుడు, గర్భ సంచిలో కణితులు, అడ్డగోడలు, రక్త హీనత ఉన్నప్పుడు సిజేరియన్ అవసరం. కొన్ని సందర్భాల్లో కాన్పు కష్టమైతే సిజేరియన్కు వెళుతున్నాం
– డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, గైనకాలజిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
సిజేరియన్తో చాలా నష్టాలు
సాధారణ డెలివరీ చేస్తే రెండు వారాల తరువాత బాలింత తన పనులు తాను చేసుకునే వీలు కలుగుతుంది. ఆపరేషన్ చేస్తే బాలింత కోలుకునేందుకు నెల వ్యవధి పడుతుంది. సాధారణ కాన్పు గాయాలు వారంలో నయమవుతాయి. సాధారణ కాన్పు బాలింత గంట వ్యవధిలోనే బిడ్డకు పాలు పడుతుంది. సిజేరియనైతే ఒక రోజు వ్యవధి తప్పనిసరి. సాధారణ డెలివరీ వారిని ఐదు రోజుల్లో డిశ్చార్జి చేయొచ్చు.
– డాక్టర్ మండవ శ్రీనివాసరావు, గైనకాలజిస్టు, జీజీహెచ్, గుంటూరు.
సిజేరియన్ ఎప్పుడు చేయాలంటే...
గర్భంలో శిశువు 3.5 కేజీలు బరువు దాటి కాన్పు కష్టమైనప్పుడు ఆప బాగా పొట్టిగా ఉన్న (4.5 అడుగులకంటే తక్కువ) మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది. బిడ్డ ఆరోగ్యం సక్రమంగా లేదని ‘ఫీటల్ డిస్ట్రస్’ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ఆపరేషన్ చేస్తారు. బిడ్డ కదలికలు తక్కువగా ఉండటం, హార్ట్బీట్ సరిగా లేకపోవడం, బేబీకి హార్ట్ సమస్య ఉండటం, కంజెన్టల్ లోపాలు, నెలలు నిండకపోవడం వంటి సందర్భాల్లో ఆపరేషన్ అవసరం. పదో నెల మొదటి వారంలోకి వచ్చినా నొప్పులు రానప్పుడు కాన్పు అవ్వని పక్షంలో సిజేరియన్ చేయాలి.