ఏపీకి రూ.518 కోట్ల కరువు నిధులు
న్యూఢిల్లీ: కరువు సహాయక చర్యలకోసం జాతీయ విపత్తు సహాయక నిధి నుంచి ఏపీకి రూ.518కోట్లు విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి ఎస్.అహ్లువాలియా తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలోని అనేక జిల్లాల్లో నెలకొన్న కరువు సహాయ చర్యలకోసం రూ.3,173కోట్ల విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాయా అని అడిగిన ప్రశ్న మేరకు ఈ సమాధానం ఇచ్చారు.
కరువు ప్రాంతాల్లో మరో 50 రోజులు ఉపాధి
వ్యవసాయ మంత్రిత్వశాఖ సిఫార్సుల మేరకు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో 50 రోజులు ఉపాధి హామీ పనులు మంజూరు చేస్తున్నట్లు కూడా అహ్లూవాలియా తెలిపారు.
ఏపీలో చెరకు రైతుల బకాయిలు రూ.44కోట్లే
ఏపీలో చెరకు రైతులకు చెక్కెర మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది జూన్ 30నాటికి రూ.44.42 లక్షలు మాత్రమేనని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీశాఖ సహాయమంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఏపీ రైతులకు చెక్కెర ఫ్యాక్టరీలు రూ.250కోట్ల మేర బకాయిలు పడిన మాట వాస్తవమేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. చెరకు సరఫరా చేసిన తర్వాత 14 రోజుల్లో చెల్లింపులు జరగకుంటే 15శాతం వడ్డీతో కలిపి బకాయిలు చెల్లించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.