ఆబోతు రంకేస్తోంది!

Cattle Frozen Sperm Center Nandyal - Sakshi

నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం రంకేస్తోంది. మేలు రకం ఆబోతుల నుంచి నాణ్యమైన వీర్యాన్ని సేకరిస్తూ ఏటా లక్ష్యాన్ని సాధిస్తోంది. అంతరిస్తున్న అరుదైనపశుజాతులను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రపోషిస్తోంది.  ఏటా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు డోస్‌ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది.  ఎక్కడ లేని విధంగా  10 జాతుల పశువుల వీర్యాన్ని సేకరించి, భద్రపరిచి అవసరమైన జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు  సరఫరా చేస్తూ అరుదైన గుర్తింపు పొందిన నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రంపై ప్రత్యేక కథనం

సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలు జాతుల పశువుల నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారు. పట్టణంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన నూనెపల్లెలోని  15.27 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ పశు గణనాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రం ఉంది. 1976 డిసెంబర్‌ 7న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లు, సిబ్బంది పని చేస్తున్నారు.

ఘనీకృత వీర్య కేంద్రానికి చెందిన భవనాలు ఐదు ఎకరాల్లో ఉండగా, మిగతా 10.27 ఎకరాల్లో ఆబోతులకు అవసరమైన సూపర్‌ నేపియర్, కాకిజొన్న, గనిగడ్డి లాంటి నాణ్యమైన పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. వీర్య నాశికలను సరైన సమయంలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడం. నిరంతరం వీర్య నాణ్యతను పరిశీలిస్తూ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా సూచించిన మినిమం స్ట్రాడెడ్స్‌ ప్రొటోకాల్‌ను పాటించడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. 1982లో ఘనీకృత పశువీర్యాన్ని నంద్యాలలోనే ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఉన్న ఆబోతులను బయోసెక్యూలర్‌ జోన్‌లో ఉంచి వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేసి ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసిన వీర్యనాశికలు మన రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కేరళ, కలకత్తా, భోపాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. 2000లో ఈ కేంద్రం అభివృద్ధి చెందడంతో ఆంధప్రదేశ్‌ పశుగణనాభివృద్ధి సంస్థలో చేర్చారు.   

నాణ్యమైన వీర్య ఉత్పత్తి ఇలా.. 
ఒక్కొక్క వీర్యనాశికలో 0.25 ఎం.ఎల్‌. వీర్యం ఉంటుంది. అందులో దాదాపుగా 2కోట్ల వీర్యకణాలు ఉంటాయి. వీర్యాన్ని సేకరించిన తర్వాత దానిని పరీక్షించి భద్రపరుస్తారు. ఉత్పత్తి చేసిన వీర్యంతో పశువుకు గర్భదారణ చేసిన అనంతరం పశువు అనారోగ్యానికి గురి కాకుండా చూస్తారు. వీర్యంలో నిర్దేశించిన కణాల శాతం కచ్చితంగా ఉండేలా చూస్తారు.  అనంతరం ఈ వీర్యాన్ని విశాఖపట్నంలోని ఆండ్రాలజీ ల్యాబోరేటరీకి పంపి నాణ్యతను పరీక్షించి అనంతరం ఇక్కడ నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సరఫరా చేస్తారు.   

సంస్థ సాధించిన విజయాలు.. 

  • 2007లో మానిటరింగ్‌ యూనిట్‌చే నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఏ–గ్రేడ్‌ సాధించింది. 2010లో బీ–గ్రేడ్‌ను సాధించింది.  
  • 2013లో సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌ వారు నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రానికి ఏ–గ్రేడ్‌ రెండవ సారి ప్రదానం చేశారు. ఈ సంవత్సరంలోనే నంద్యాల నుంచి జేకే ట్రస్ట్‌ ద్వారా అదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బాసరా, తమిళనాడు రాష్ట్రాలకు వీర్యనాశికులు సరఫరా చేసింది.  
  • 2016–17లో సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌ నుంచి మూడవసారి నాణ్యమైన వీర్య ఉత్పత్తిలో ఏ–గ్రేడు సాధించింది.        
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top