ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
నెల్లూరు ,చిట్టమూరు: ఆర్టీసీ బస్సు ముందు చక్రం ఊడిపోవడంతో బస్సు పక్కకి ఒరిగింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని రాఘవవారిపాళెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రయాణికులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు (ఏపీ 26 జెడ్ 55) కోట నుంచి సూళ్లరుపేటకు 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చిట్టమూరు మండలం రాఘవవారిపాళెం గ్రామం ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చే సరికి బస్సు ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో వాహనం పక్కకు వాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు.