బావను హత మార్చిన బావమరిది
చేపలు వలలుకోసే కత్తితో ఘాతుకం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
చీరాల రూరల్ : బావమరిది బతకగోరతాడని అంటారు పెద్దలు. కానీ వాడరేవులో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘటన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. బావ బాగోగులు చూడలేదు సరికదా... అతడిని కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు బావమరిది. రూరల్ సీఐ బేతపూడి ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు... వాడరేవు పాకలకు చెందిన మల్లె నాగూర్ (25), నాగలక్ష్మి భార్య భర్తలు, వీరికి రెండేళ్ల వయస్సు కలిగిన బాబు ఉన్నాడు. నాగలక్ష్మి మళ్లీ గర్భవతి అయింది. ఇరువురు తల్లిదండ్రులు ఇళ్లు అదే ప్రాంతంలో అర కిలోమీటరు దూరంలో ఉంటాయి. ఈ క్రమంలో నాగలక్ష్మి గర్భవతి అవడంతో తన పుట్టింటికి వచ్చింది. భార్యను చూసేందుకు ఆమె భర్త నాగూర్ కూడా ఆమె వద్దకు వచ్చాడు. అయితే నాగలక్ష్మి అన్నయ్య అయిన మైలపిల్లి సత్తిబాబు నిత్యం మద్యం తాగి ఆ మత్తులో తల్లిని కొడుతుంటాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు తన తల్లి అయిన కాసులమ్మను కొట్టడం ఆరంభించాడు.
అన్నం తింటూ ప్లేటును తల్లి మీదకు విసిరాడు. ఇంతలో అక్కడే ఉన్న అతని బావ అయిన నాగూర్ తల్లిని కొట్టడం మంచి పద్దతి కాదని సత్తిబాబును వారించాడు. ఈ విషయమై ఆగ్రహం చెందిన సత్తిబాబు నాకే అడ్డు వస్తావా అంటూ ఇంటి చూరులో దాచిన చేపల వలలు కోసే కత్తి తీసుకొచ్చి నాగూర్ పొట్టలో కుడివైపున బలంగా పొడిచాడు. దీంతో అతని పేగులు బయటకు వచ్చాయి. మరో రెండు కత్తిపోట్లు అతని కుడిచేతిపై వేశాడు. దీంతో నాగూర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో స్పందించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో పాకలలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ నాగరాజు, రూరల్ సీఐ ప్రసాద్, ఏఎస్సై శ్రీనివాసరావులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుడు సత్తిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.