గ్రామాల విలీనానికి బ్రేక్ !
రాజమండ్రి రూరల్ : రాజమండ్రి నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలను యథాతథస్థితిలో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. నగర పాలకసంస్థలో 21 గ్రామాల విలీనానికి బ్రేక్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ మండలంలోని పది గ్రామాలు, రాజానగరం మండలంలోని ఏడు గ్రామాలను, కోరుకొండ మండలంలోను నాలుగు గ్రామాలను రాజమండ్రి నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు 2013 మార్చిలో జీవో 94ను పురపాలకశాఖ, జీవో 99ను పంచాయతీరాజ్శాఖ జారీచేశాయి. గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. విలీ నం వీల్లేదంటూ తీర్మానాలు పంచాయతీలు ప్రభుత్వానికి పంపా యి.
దీనిపై కోర్టు నిబంధనలు, వెసులుబాటు మేరకు వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ పంచాయతీల తీర్మానాలు చెల్లవని, గ్రామాలను రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలు, వెసులుబాటు మేరకు విలీనం చేస్తున్నట్టు పేర్కొంటూ మార్చి 2014న జీవో 44ను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. పంచాయతీలను డీ నోటిఫై చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. విలీన సమస్య కోర్టు పరిధిలో ఉండగా ఈ నెల 5న 21 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు సర్క్యులర్ జారీ చేసింది. డీపీఓ ఆయా పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 21 పంచాయతీలకు 11 చోట్ల రికార్డులను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన చోట్ల ప్రజ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కార్పొరేషన్లో 21 పరిసర గ్రామాల విలీనం విషయం పిల్ నంబర్79 కోర్టు పరిధిలో ఉన్నందున పంచాయతీల రికార్టుల స్వాధీనం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని మున్సిపల్ , పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసినా, డీపీఓ అత్యుత్సాహం చూపించారు. మాజీ వైస్ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, హుకుంపేట గ్రామానికి చెందిన వల్లేపల్లి సుబ్రహ్మణ్యం రెండు శాఖల జీవోలపైన, పంచాయతీ అధికారి రికార్డులు స్వాధీనంపైన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి విచారణ చేపట్టారు. పెండింగ్లో ఉన్న పిల్ -79పై తీర్పు వెలువడే వరకు గ్రామాలను యథాస్థితిగా ఉంచాలని తీర్పునిచ్చిన ట్టు రాజబాబు, సుబ్రహ్మణ్యం తెలిపారు. స్టేటస్ కోరావడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.