హక్కులు లేవు..
శ్రీకాకుళం: ‘పదేళ్లుగా బీఆర్ఏయూలో బోధనేతర ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. కానీ మాకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలేవీ లేవు’ అంటూ ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీ సిబ్బంది ఎస్.సత్యనారాయణ జగన్కు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమను రెగ్యులర్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, మీరైనా అమలు చేయాలని విన్నవించారు.
అర్హత లేదంటున్నారు
‘సార్.. నేను హిందీ ప్రచారక్ శిక్షణ పూర్తి చేశాను. ప్రస్తుతం డీఎస్సీకి సిద్ధమవుతున్నాను. 2014 డీఎస్సీలో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసి పరీక్ష రాశాను. అయితే ఆ ఫలితాలు విత్హెల్డ్లో పెట్టారు.’ అంటూ విజయనగరానికి చెందిన డీఎస్సీ అభ్యర్థిని సోము జీవిత జగన్కు చెప్పారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తే తీర్పు అనుకూలంగా వచ్చినా ఫలితం లేదన్నారు. తాజా డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు.
పరిహారం లేదు
‘మా గ్రామ పరిసర ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ కళా శాల నిర్మాణానికి దళితుల భూములు లాక్కున్నారు.’ అని ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురానికి చెందిన బలగ గణపతి జగన్కు తెలిపారు. డీ పట్టా భూములని, నష్టపరిహారం అందిస్తామని 85 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తమ చుట్టూ తిప్పుతున్నారు గానీ నష్ట పరిహారం అందజేయడం లేదని చెప్పారు.
సాయం చేయాలన్నా..
‘అన్నా నేను దివ్యాంగుడిని. కదల్లేకపోతున్నాను. నాలు గేళ్ల వరకు అందరిలాగానే ఉన్నా తర్వాత సమస్య మొదలైంది’ అంటూ ఎచ్చెర్ల మండలం జాలారి కొయ్యాం గ్రామానికి చెందిన మారుపల్లి సతీష్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ రూ.1500లు ఇవ్వాల్సి ఉన్నా, 1000 రూపాయలు మాత్రమే అందజేస్తున్నారని తెలిపారు. వైద్యం కోసం తల్లిదండ్రుల అప్పులు చేస్తున్నారని, సాయం చేయాలని కోరారు.