బంతి కోసం వెళ్లి మృత్యు ఒడికి

Boy Fell down into well In Anantapur - Sakshi

తాడిమర్రి : బావి గట్టుపై పడిన బంతిని తీసుకునేందుకు ప్రయత్నించిన బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీటమునిగి మృత్యు ఒడి చేరాడు. ఈ ఘటనతో మేడిమాకులపల్లిలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన గోనుగుంట్ల మహేష్‌బాబు, నీలావతి దంపతులకు మహిత్‌కుమార్, లోహిత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కర్నూలులోని ప్రైవేట్‌ స్కూల్‌లో నాలుగు, మూడో తరగతి చదువుతున్నారు. వేసవి సెలవులు రావడంతో నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చారు.

శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో లోహిత్‌కుమార్‌ (9) ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బంతి ఇంటిపక్కన ఉన్న వ్యవసాయ బావి గట్టుపై పడింది. బంతిని తీసివ్వాలని అవ్వను అడగ్గా.. ఎవరైనా అటు వస్తే తీయిస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లింది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండటంతో లోహిత్‌కుమార్‌ బంతికోసం బావిలోని గట్టుపైకి దిగే క్రమంలో కాలుజారి ఐదుమట్ల నీటిలోకి పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీటమునిగి బాలుడు మృతి చెందాడు.

కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు లోహిత్‌కుమార్‌ గాలింపు చేపట్టగా.. బావిపక్కన చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి నీటిలో వెతికారు. ఎక్కువ లోతు నీరు ఉండటంతో జాడ కనిపించలేదు. దీంతో ఎనిమిది మోటార్ల సాయంతో సాయంత్రం 6 గంటల నుంచి బావిలోని నీటిని తోడించగా శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు లోహిత్‌కుమార్‌ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. దీంతో ఒక్కసారిగా గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top