ద్రోహం చేసిన బొబ్బిలి రాజులు
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్రెడ్డికి, ఓట్లేసిన ప్రజలకు బొబ్బిలి రాజులు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్ సీపీ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకటచినఅప్పలనాయుడు మంగళవారం ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీను వీడి తెలుగుదేశంలోకి వెళ్లడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
జగన్మోహన్రెడ్డి బొబ్బిలి రాజులకు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిలు బాధ్యత, ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి ఎంతో గౌరవిస్తే అలాంటి పార్టీను మోసం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారని దుయ్యబట్టారు. గత రెండు రోజులుగా బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు టీడీపీకి పట్టున్న గ్రామాల్లో సైతం విశేష స్పందన లభిస్తుండడంతో అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు చింపడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.