ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే

BJP Minority Morcha Appreciation Meeting in Nellore - Sakshi

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): దేశంలో ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్‌ పార్టీయేనని, ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మైనార్టీల అభివృద్ధికి కృషి జరుగుతోందని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ అన్సారీ, కేంద్ర వక్ఫ్‌ బోర్డు సభ్యుడు హనీఫ్‌ అలీ పేర్కొన్నారు. నగరానికి చెందిన బీజేపీ సీనియర్‌ మైనార్టీ నేత అబ్దుల్‌ రహీంకు మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవి లభించడంతో నిర్వహించిన అభినందన సభలో పాల్గొనేందుకు మంగళవారం నగరానికి వచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని మైనార్టీలకు బీజేపీని శత్రువుగా చూపి దూరం చేసేందుకు కాంగ్రెస్‌ యత్నించిందని ఆరోపించారు. అన్ని మతాలను గౌరవించే బీజేపీ ముస్లింల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీయలేదని చెప్పారు. గత సీఎం చంద్రబాబు ఫొటోలు మార్చి వారి పథకాలుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు అస్తులను గుర్తించి అన్యాక్రాంతం కాకుండా వాటిని పరిరక్షిస్తామని ప్రకటించారు. అనంతరం అబ్దుల్‌రహీం దంపతులను సత్కరించారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ్, రాష్ట్ర నాయకులు ఖలీబుతుల్లా, సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, శ్రీనివాసులు, చాంద్‌బాషా, షఫీపుల్లా, సుమేరా, యాస్మిన్, తాజుద్దీన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నగరాధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, జిల్లా నాయకులు ఫిరోజ్, అజారుద్దీన్, షబ్బీర్, తాహీర్, మహబూబ్‌బాషా, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top