చంద్రబాబుది స్వార్థ రాజకీయం
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘భూమన’
విజయనగరం , ప్రజాసంకల్పయాత్ర బృందం: స్వార్థ రాజ కీయాలకు నిలువెత్తు నిదర్శనం ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం చిన్నరాయుడుపేట వద్ద ఆయన మాట్లాడారు. స్వార్థ రాజకీయం, అవకాశవాద రాజకీయం అనే పదాలు చంద్రబాబునాయుడుకు సరిపోవన్నారు. చంద్రబాబునాయుడు కోసం కొత్త పదాలు వెతకాల్సిన దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో మార్పు కోసమే పొత్తులని చెబుతున్న చంద్రబాబు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే కొత్తు ఎత్తులు.. పొత్తులు కడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబునాయుడు పది సార్లు ఫోన్ చేస్తేనే సమావేశమయ్యామని అన్నాడీఎంకే నేత స్టాలిన్ స్వయంగా చెప్పారని, దీన్నిబట్టి చూస్తే చంద్రబాబుకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీ మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి రాహుల్గాంధీతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యాడంటే చంద్రబాబునాయుడు ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడో స్పష్టమవుతోందన్నారు. ఇదిలా ఉంటే ఆయన భజన మీడియా వంత పాడుతూ ఆయన ఏం చెబితే అదే నిజమని ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నాయని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి తిరుగులేని ప్రజాదరణ వస్తున్న నేపథ్యంలో ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుండడంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని చెప్పారు.