బెట్టింగ్‌ బంగార్రాజులు

Bettings on Narendra Modi And Rahul Gandhi - Sakshi

మోదీ–రాహుల్‌..ఎవరి సత్తా ఎంత?

ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఎవరికెన్ని ఓట్లు?

ప్రత్యేక యాప్‌తో బెట్టింగ్‌ దందా

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగం, రైతు సమస్యలు, గ్రామీణ సంక్షోభం ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను మసకబార్చాయని ఒకట్రెండు నెలల క్రితం వరకు అందరూ భావించారు. కానీ ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో, ప్రతీకారంగా భారత్‌ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్స్‌కి దిగిందో జనం మనసు మారినట్టుగానే అనిపిస్తోంది. మోదీ నాయకత్వంపై వారికి విశ్వాసం పెరిగినట్టుగా సట్టా బజార్‌లో బెట్టింగ్‌ల ధోరణి తేటతెల్లం చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు విఫల ప్రయోగంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదు. జీఎస్టీ అనేది సామాన్యుడికి అర్థం కాని ఓ బ్రహ్మ పదార్థం. నిరుద్యోగం, రైతు సమస్యలు, గ్రామీణ సంక్షోభం వంటివన్నీ పాక్‌పై మిరాజ్‌ దాడుల ముందు చిన్నగీతగా మారిపోయాయి. ఇంకా ఎన్నికల వేడి రాజుకోక ముందే బెట్టింగ్‌ బంగార్రాజులుసై అంటే సై అంటున్నారు. నరేంద్ర మోదీ మళ్లీ గద్దెనెక్కడం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకంతో బెట్టింగ్‌లు కాస్తున్నారు. పార్టీలతో పని లేదు.

అభ్యర్థితో సంబంధం లేదు. వాళ్ల కళ్ల ముందు కనిపిస్తున్నది ప్రజల్లో నరేంద్రమోదీకున్న ఇమేజ్, పప్పూ ముద్రని తొలగించుకుంటూ ముందుకు సాగుతున్న రాహుల్‌గాంధీ. వీరిద్దరి మధ్య పందేలు ముమ్మరంగా సాగుతున్నాయి. దుబాయ్‌ నుంచి నడుస్తున్న ఆన్‌లైన్‌ సట్టాబజార్‌లో డబ్బులు పెడుతున్న పందెం రాయుళ్లు ఎన్నికలకు కాస్త ముందు భారత్, పాక్‌ మధ్య పెరిగిపోయిన ఉద్రిక్తతలు మోదీకి అనుకూలంగా మారాయని భావిస్తున్నారు. అందుకే  బీజేపీకి 245–250 మధ్య సీట్లు వస్తాయని అంచనాతో పందేలు కాస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌కు 75–77 మధ్య సీట్లు వస్తాయని బెట్టింగ్‌కు దిగుతున్నారు. ఎన్నికలు ఇంకాదగ్గరపడుతున్న కొద్దీ బీజేపీకే అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

రాత మార్చిన మార్చి
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమర్పించే సమయానికి బీజేపీకి అంత ఊపులేదని సట్టా బజార్‌ వర్గాలు వెల్లడించాయి. కానీ ఎప్పుడైతే భారత్, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. అంతకు ముందు బీజేపీకి 180కి మించి సీట్లు రాకపోవచ్చునని సట్టా బజార్‌ అంచనాలు వేసింది. ఒకానొక దశలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడం వంటివి నిశితంగా సట్టా బజార్‌ నిర్వాహకులు గమనించారు. నరేంద్ర మోదీకి బదులుగా నితిన్‌ను పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు చెలరేగాయి. బీజేపీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ 200 స్థానాలను కోల్పోయి ఉండేదని పందెం నిర్వాహకులు బల్లగుద్ది చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో బెట్టింగ్‌ మార్కెట్‌ లక్ష కోట్ల రూపాయలు దాటేసింది. ఈ సారి మరింతగా పెరిగి కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా.

అంతా అరచేతిలోనే
ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండటంతో బుకీలంతా హైటెక్కు అవతారం ఎత్తారు. పందేల కోసం ప్రత్యేకంగా యాప్‌లు తయారు చేస్తున్నారు. ఫోన్లలోనే కోట్లాది రూపాయలు చేతులు మారిపోతుంటాయి. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్లకి ట్రేడింగ్‌కి పరిమితులున్నట్టే చిన్న చిన్న బుకీలకు కూడా పరిమితులుంటాయి. టజుy ్ఛ్ఠఛిజ్చిnజ్ఛ,  ్టౌuటవంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసి చిన్న బుకీలకు ఇస్తారు. అందులో జరిగే బెట్టింగ్‌ మార్కెట్‌ను దుబాయ్‌ వంటి దేశాల నుంచి నిర్వాహకులు గమనిస్తూ ఉంటారు. ఇంకా ప్రచార హోరు వేడెక్కాక, నేతల మాటలు, చేతల ప్రలోభాలకు లోనయ్యే ఓటరు ట్రెండ్స్‌ని, ఎన్నికల వార్తల్ని ఈ యాప్స్‌లో అప్‌డేట్‌ చేస్తూ ఉంటారు. ఎన్నికల తేదీలు దగ్గరపడే కొద్దీ రోజురోజుకీ ట్రెండ్స్‌ మారిపోతుంటాయి. పందెం జోరందుకుంటుంది.

కమలంపైనే కాయ్‌ రాజా కాయ్‌...
ఎన్నికల వేడి రాజుకోగానే పందెం కోళ్లు ‘పుంజు’కున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో సహజంగానే పంటర్లు కూడా జోరు మీదున్నారు. శరవేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలతో టీట్వంటీ క్రికెట్‌ తరహాలోనే పందాలు కూడా మారిపోతున్నాయని సట్టామార్కెట్‌ సమాచారం. 

పుంజుకున్న బీజేపీ
ప్రస్తుతం బెట్టింగ్‌ మార్కెట్‌ బీజేపీ గెలుపుపై అచంచలమైన నమ్మకం చూపిస్తోంది. ఎన్నికల్లో  బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే గెలుస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా పంటర్లలో వ్యక్తం అవుతోంది. సట్టా మార్కెట్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గత నెలలో మన సైన్యం జరిపిన దాడులు  బీజేపీకి ప్లస్‌   పాయింట్‌గా మారాయి. జైష్‌ ఎ మహ్మద్‌ స్థావరాలపై అత్యంత సాహసోపేతంగా చేసిన ఈ దాడుల మూలంగా  బీజేపీ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయిందని బెట్టింగ్‌ మార్కెట్‌ అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 200 నుంచి 230 సీట్ల దాకా సాధిస్తుందని బుకీస్‌ ఈ దాడులకు ముందుగా అంచనా వేశారు. దీని ప్రకారం తొలుత 1:1 (రూపాయికి రూపాయి) చొప్పున ఆఫర్‌ చేశారు. అయితే దాడుల అనంతరం 245 నుంచి 251 సీట్ల దాకా మొత్తం ఎన్డీయే 300 సీట్ల దాకా సాధిస్తుందని అంటున్నారు. 

మారిన రేట్లు...
అలాగే దాడులకు ముందు 200 నుంచి ఆపైన సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకుంటుంది అనే అంశంపై 7ః1గా సాగిన పందాలు (రూపాయికి 7 రెట్లు) ఇప్పుడు ఏకంగా 10ః1 (రూపాయికి 10రెట్లు)కి  చేరాయి  తీవ్రవాదాన్ని దేశప్రజలు తీవ్రమైన సమస్యగా భావిస్తుండడం, పుల్వమా దాడి పట్ల పాక్‌పై వెల్లువెత్తిన ఆగ్రహం  కారణంగానే తాజా దాడులు మోదీ ప్రభుత్వంపై ఆదరణ పెంచాయంటున్నారు. . కొన్ని నెలల క్రితం దాకా నోట్ల రద్దు, జిఎస్టీ, రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేసినప్పటికీ... తాజా ఉగ్ర–సైన్యం దాడులు పరిస్థితిని మార్చాయంటున్నారు. అలాగే కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించినా కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరిగే అవకాశాలూ కొట్టి పారేయలేమంటున్నారు. అయితే ఎన్నికలపై బుకీల అంచనాలు క్రికెట్‌ మ్యాచ్‌లో లాగే వేగంగా మారిపోతుంటాయి. ఈ తరహా మార్కెట్లకు రాజస్తాన్‌ కేంద్రంగా ఉండగా, ముంబయి, ఢిల్లీలు రాజస్తాన్‌ ట్రెండ్స్‌ను అనుసరిస్తుంటాయి. ఒకసారి అభ్యర్థుల ఖరారు తర్వాత చెప్పుకోదగ్గ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top