కమీషన్లు ఇస్తేనే బీసీ కార్పొరేషన్ రుణాలు
విశాఖపట్నం :‘బీసీ కార్పొరేషన్ రూ.లక్ష రుణం మంజూరు చేస్తుంది. రాయితీలో 30 శాతం జన్మభూమి కమిటీలకు ఇస్తేనే రుణాలు మంజూరు చేస్తున్నారు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి బొడ్డు గోవిందరావు, మాకవరపుపాలెం మండలం పెద్దపాలెం గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో టీడీపీ కార్యకర్తల నుంచి 30 శాతం కమీషన్, వైఎస్సార్ సీపీ కార్యకర్తల నుంచి 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాపోయారు. నర్సీపట్నం నియోజవర్గంలో వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన వాళ్లకు 65 ఏళ్లు దాటినా పింఛన్ ఇవ్వడం లేదని, అదే టీడీపీలో ఉన్న వారికి 50 ఏళ్లు ఉన్నా.. 60 ఏళ్లుగా మార్చి పింఛన్ ఇస్తున్నారని జగన్ మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
యువకులపై అక్రమ కేసులు
వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న యువకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని గన్నవరం మాజీ సర్పంచ్ పైల సునీల్ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారనే కారణంతో టీడీపీ కార్యకర్తలు విద్యార్థులను కేసుల పేరుతో భయపెడుతున్నారన్నారు.