కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులను అరికట్టాలి
శ్రీకాకుళం అర్బన్: ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం వరకు నడిచే స్టేజ్ క్యారేజీ బస్సులను కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులుగా నడుపుతున్నారని, వీటిని అరికట్టాలని ఉత్తర జిల్లా ప్రైవేటు బస్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కవిటి మండలం బల్లిపుట్టుగ వద్ద ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని ఆ సంఘం ప్రతినిధులు సోమవారం కలుసుకుని వినతిపత్రం అందించారు. గత నాలుగేళ్లుగా ఇచ్ఛాపురం విశాఖపట్నం మధ్య 16 బస్సులను స్టేజ్ క్యారేజీ పర్మిట్లు తీసుకుని కాంట్రాక్ట్ క్యారేజీలుగా తిప్పుతున్నారని తెలిపారు.
దీనిపై ట్రాన్స్పోర్టు కమిషనర్ స్పందించి, ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నారు. అయితే... రాష్ట్ర రవాణా శాఖామంత్రి అచ్చెన్నాయుడు, సీఎం తనయుడు లోకేష్ అండదండలతో దౌర్జన్యంగా మళ్లీ బస్సులను తిప్పుతున్నారని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. దీని వల్ల అటు ఆర్టీసీకి, అటు కాంట్రాక్ట్ క్యారేజీలుగా తిరిగే ప్రైవేటు బస్సులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జిల్లా ప్రైవేట్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కట్టా సూర్యప్రకాష్, ఎల్ఎస్ మణి తదితరులు జగన్మోహన్రెడ్డిని కలసి వివరించారు.