‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర్రస్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. రేపు సాయంత్రానికి అన్ని జిల్లాల్లో స్టాంగ్ రూమ్లు సిద్ధం చేయాలన్నారు. ఈ సారి 1.26 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావుండకూడదన్నారు. ప్రణాళికబద్ధంగా పరీక్షలను నిర్వహించాలని చెప్పారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.