ప్రాజెక్టులను తరలించేస్తున్నారు
ప్రజా సంకల్పయాత్ర బృందం: విశాఖలో ఏర్పాటు చేయాల్సిన సిడాక్, బయో టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్లు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వర్సిటీ దూరవిద్య కేంద్రం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.విజయకుమార్తోపాటు పలువురు రిటైర్డ్ ప్రొఫెసర్లు ప్రజా సంకల్పయాత్రలో ఆయన్ని కలసి యూనివర్సిటీ బలోపేతానికి సూచనలు, సలహాలు అందజేశారు.
విశాఖకు కేటాయించిన ఎయిమ్స్ను సైతం ఇక్కడకు రాకుండా తరలిస్తున్నారన్నారు. వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కృషిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. నవరత్నాలు పథకాలు వైఎస్సార్ సంక్షేమ పథకాలకు మరింత బలాన్ని అందిస్తూ వాటికి కొనసాగింపుగా నిలుస్తాయన్నారు.విశ్వవిద్యాలయం ఆచా ర్యుల పదవీ విరమణను 62 నుంచి 65 ఏళ్లకు పెంపుదల చేయాలని వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఆటా) కార్యదర్శి డి.వి.రామకోటిరెడ్డి సూచించారు. సీపీఎస్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్నిఅమలు చేయాలని కోరారు. ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలన్నారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఆచార్య టి.భైరాగిరెడ్డి, ఆచార్య పేటేటి ప్రేమానందం తదితరులు ఉన్నారు.