ఏపీ ఉద్యోగులపై దాడి హేయమైన చర్య
ఏపీ ఎన్జీవో నాయకులు
నెల్లూరు(రెవెన్యూ): తెలంగాణ ఉద్యోగులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్వీఆర్సీ శేఖర్రావు, వై.రమణారెడ్డి చెప్పారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం ఏపీ ఉద్యోగులపై తెలంగాణ వారు దాడి చేయడం హేయమైన చర్యన్నారు. ఏపీ ఎన్జీవో భవనంలో వాటా కావాలంటూ దాడులకు దిగడం పద్ధతి కాదని పేర్కొన్నారు.
సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్జీవో భవనం స్థలం కోసం అప్పటి అధ్యక్షుడు శ్రీరాములు రూ.25.35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని వెల్లడించారు. కొందరు తెలంగాణ ఉద్యోగులు పనిగట్టుకుని దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీఎన్జీవో జిల్లా నాయకులు ఆంజనేయవర్మ, ప్రభాకర్రెడ్డి, రవికుమార్, సుధాకర్రావు, సతీష్బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.