సఫలం దిశగా ఏపీఎస్ ఆర్టీసీ చర్చలు
సాక్షి, విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంతో ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు సఫలం దిశగా సాగుతున్నాయి. జేఏసీ నేతలు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో ఈ ఉదయం మూడుగంటలకుపైగా చర్చలు జరిపారు. జేఏసీ నేతలు జరిగిన చర్చలపై ఎంఓయూ కోరాగా ఎండీ సురేంద్ర బాబు సమ్మతించారు. చర్చల అనంతరం జేఏసీ ఎంప్లాయిస్ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ.. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. తమ డిమాండ్లపై ఎంఓయూ కోరామని తెలిపారు. ఆర్టీసీ విలీనం అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా ఉండడాన్ని స్వాగతించారు.
ఆర్థికపరమైన ఇతర అంశాలపై ప్రభుత్వపరంగా న్యాయం జరిగిందన్నారు. యాజమాన్యపరంగా చర్చలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయన్నారు. మధ్యాహ్నం తర్వాత మరోసారి ఎండీతో చర్చల అనంతరం రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అవుతామన్నారు. సమ్మె చేయాలా లేక విరమించాలా అన్న దానిపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.