కరోనాపై పకడ్బందీ చర్యలు
రాష్ట్ర మంత్రుల వెల్లడి
కడప సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కడప కలెక్టరేట్లో కోవిడ్–19 సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం అంజద్బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డితో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాకు విదేశాల నుంచి 4,941 మంది రాగా పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే...
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా నియంత్రణపై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు.
► రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వ్యవసాయ ఉత్పత్తులు, హార్టికల్చర్, ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
► కరోనా నిర్మూలనకు ఇప్పటికే రూ.120 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు, ప్రాజెక్టుల బిల్లులు కూడా దాదాపు క్లియర్ చేశాం.
► ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా ట్విట్టర్ వేదికగా విమర్శించడం దారుణం.
► గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రూపాయి ఫండ్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాంటి వివక్ష చూపట్లేదు.