పేదలకు ఉపాధిపై సర్కారు దృష్టి
సాక్షి, అమరావతి: లాక్డౌన్తో మధ్యలో ఆగిపోయిన ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్తో ఏర్పడిన అనేక అవాంతరాలను అధిగమించి పేదలకు ఉపాధిని కల్పించే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు లాక్డౌన్లో సడలించిన నిబంధనలకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వివిధ గ్రామీణ రోడ్డు నిర్మాణ పనులతోపాటు వివిధ ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ నెలాఖరు కల్లా మరిన్ని పనులు మొదలయ్యే అవకాశం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
► విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్సార్, కృష్ణా జిల్లాల్లో 22 గ్రామీణ రోడ్డు నిర్మాణ పనులు లాక్డౌన్తో మధ్యలో ఆగిపోయి పది రోజుల క్రితమే తిరిగి ప్రారంభమయ్యాయి.
► మే 30 నాటికి రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో మరో 58 గ్రామీణ రోడ్డు పనులు ఆరంభం కానున్నాయి.
► రాష్ట్రవ్యాప్తంగా 900 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 350 రైతు భరోసా కేంద్రాలు, 316 హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే ఆరంభమయ్యాయి.
► 9,715 గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులతోపాటు 3,755 ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణ పనులకు కొత్తగా అనుమతిచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఆయా పనులన్నీ రానున్న కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని చెప్పారు.