అత్యాచారం చేస్తే ఉరే
ఏపీ దిశ యాక్ట్–2019 ప్రకారం..
మహిళలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష
నిర్ధారించే ఆధారాలున్నప్పుడు (కన్క్లూజివ్ ఎవిడెన్స్) 21 రోజుల్లోనే తీర్పు
మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు
మహిళలు, బాలికల భద్రత కోసం ‘ఏపీ దిశ యాక్ట్’
ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టరూపం దాల్చనున్న కొత్త బిల్లు
ఐపీసీలో 354(ఇ), 354(ఎఫ్) సెక్షన్ల చేర్పునకు గ్రీన్సిగ్నల్
పిల్లలపై లైంగిక నేరాలకు 10 నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష
సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిస్తే 2 నుంచి 4 ఏళ్ల జైలు
ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కొత్త చట్టం ముసాయిదాకు కేబినెట్ అంగీకారం
అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలంటే హడలెత్తేలా కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. ఆడవాళ్లపై అకృత్యాలు జరిగిన వెంటనే ఉపశమనం కలిగే చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపిల్ల ఎదురు చూస్తోందని.. అందుకే ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నామని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ దిశ చట్టంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఇండియన్ పీనల్ కోడ్లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఇండియన్ పీనల్ కోడ్ 354(ఇ) ముసాయిదా బిల్లు
–మెయిల్స్, సోషల్మీడియా, డిజిటల్ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు.
– మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష
ఇండియన్ పీనల్ కోడ్ 354 (ఎఫ్) ముసాయిదా బిల్లు
– పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష..
– నేరం తీవ్రతను బట్టి 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు
– పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష
ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి అంగీకారం
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకరించింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖలోనే ఈ విభాగం ఏర్పాటు చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగ్గట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవల కొనసాగింపునకు అంగీకారం తెలిపారు.
అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6 వరకూ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీషు మాధ్యమంలో బోధనకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ
ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు కొత్త శాఖను ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలమైన యంత్రాగం ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. లక్ష్యాల సాధనకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేలా కార్యచరణ ఉంటుంది. ఉద్యోగులను సమర్ధంగా వినియోగించుకోవడంతోపాటు లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, మెరుగైన భాగస్వామ్యం ద్వారా మంచి ఫలితాలు రాబడతారు.
అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠినచర్యలు
రాష్ట్రంలో అక్రమంగా మద్యాన్ని తయారుచేసినా, విక్రయించినా, రవాణ చేసినా కఠిన శిక్షలకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణించి 6 నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. మొదటిసారి పట్టుబడితే జరిమానా రూ.2 లక్షలు, రెండోసారి జరిమానా రూ.5 లక్షలు విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ఫీజు కన్నా 2 రెట్ల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు.
‘కాపు ఉద్యమం’ కేసుల ఉపసంహరణ
కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తుని ఘటన సహా కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులన్నీ ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసుల్ని ఎత్తివేయాలని నిర్ణయించారు.
వైఎస్సార్ పెన్షన్ కానుక మార్గదర్శకాలకు ఆమోదం
వైఎస్సార్ పెన్షన్ కానుక మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలోని మార్గదర్శకాలను సవరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పెన్షన్ కానుక వర్తింప చేయాలని నిర్ణయించారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక వర్తింపచేస్తారు. సొంతంగా కారు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నవారికి మినహాయింపు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్నవారు అర్హులు. కుటుంబంలో ఆదాయపుపన్ను చెల్లించేవారు అనర్హులు.
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
– ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. రూ.101 కోట్ల షేర్ క్యాపిటల్తో ఏర్పాటు.
– ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ బోర్డు చట్టం–2019 ముసాయిదాకు బిల్లుకు గ్రీన్సిగ్నల్. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు ముసాయిదా బిల్లు.
– ఆంధ్రప్రదేశ్ పప్పుధాన్యాల బోర్డు చట్టం – 2019 బిల్లుకు ఆమోదం.
– ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు కేబినెట్ అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22 వేల కోట్లు.
–ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి పచ్చజెండా
– ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ సవరణ ముసాయిదా బిల్లు–2019 కు ఆమోదం
– వీఓఏ/సంఘమిత్ర/యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. జీతాలు రూ.10వేలకు పెంచుతూ ఇటీవలే నిర్ణయం.
– ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21–ఎ (1) (ఇ) సవరణకు కేబినెట్ ఆమోదం.
– చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15.28 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయింపునకు మంత్రివర్గం అనుమతి.
–ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్ట్లో సవరణలకు కేబినెట్ పచ్చజెండా. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన నియమించిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు.
– కడప జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటు. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు.
– కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
– ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్మన్గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్ ఆమోదం.