పట్టుబడిన నగదులో అధిక శాతం ఏపీదే
రూ.55 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అంశాలపై ఎన్నికల సంఘం దృష్టి కేంద్రీకరించింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రూ.55 కోట్ల నగదు పట్టుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రూ.143.47 కోట్ల నగదు పట్టుకోగా అందులో సుమారు 30 శాతం ఆంధ్రప్రదేశ్లోనే పట్టుబడడం గమనార్హం. అలాగే దేశవ్యాప్తంగా రూ.89 కోట్ల విలువైన లిక్కర్ పట్టుబడగా.. ఏపీలోనే రూ.12 కోట్ల విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. రూ. 40 లక్షల విలువైన డ్రగ్స్ కూడా ఏపీలోనే స్వాధీనం చేసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా రూ.162 కోట్ల విలువైన బంగారం, వెండి నగలు పట్టుకోగా.. ఒక్క ఏపీలోనే రూ.30 కోట్ల విలువైన నగలు పట్టుకున్నారు.
రూ.6 కోట్ల విలువైన ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఏపీలో రూ.103.40 కోట్ల విలువైన నగదు, మద్యం, నగలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో రూ. 36.6 కోట్ల నగదు, రూ.68 కోట్ల నగలుసహా మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 107.24 కోట్లు. 80 లోక్సభ స్థానాలు ఉన్న యూపీలో రూ.8.26 కోట్ల నగదు పట్టుబడగా రూ.59.04 కోట్ల నగలు పట్టుబడ్డాయి. మొత్తంగా యూపీలో స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.104.53 కోట్లు. తెలంగాణలో స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.8.21 కోట్లు తెలంగాణలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 8.21 కోట్లు. ఇందులో రూ. 5.26 కోట్ల మేర నగదు, రూ.39 లక్షల విలువగల మద్యం, రూ. 2.38 కోట్ల విలువగల డ్రగ్స్, రూ.16 లక్షల విలువైననగలు ఉన్నాయి.