ఎడిటర్లతో భేటీ కానున్న అమిత్‌ షా

తెలుగు పత్రికల ఎడిటర్లతో భేటీ కానున్న అమిత్‌ షా - Sakshi


28న రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన  




సాక్షి, అమరావతి: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా 29న తెలుగు పత్రికల ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లతో భేటీ కానున్నారు. విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్లపత్రికల బ్యూరో చీఫ్‌లను కూడా సమావేశానికి ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా అమిత్‌ షా పాల్గొనే కార్యక్రమాలపై చర్చించేందుకు బీజేపీ ముఖ్య నేతలు గురువారం ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కార్యక్రమాల జాబితాను సిద్ధం చేసి, ఢిల్లీలోని అమిత్‌ షా కార్యాలయానికి పంపారు.



కాగా, 28న రాష్ట్ర పర్యటనకు వచ్చే అమిత్‌ షాకు ఘనస్వాగతం పలకాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు. 28న ఉదయం 9.30 గంటలకు అమిత్‌షా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. అక్కడి నుంచి విజయవాడ స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. మూడు రోజుల పర్యటనలో ఒక రాత్రి పార్టీ కార్యకర్త ఇంటిలో బస చేయడంతో పాటు ఆ రాత్రి అక్కడి బూత్‌ కమిటీ సభ్యులతో అమిత్‌షా సమావేశయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు. అయితే ఏపీ పర్యటనకు రావడం లేదని అమిత్‌ షా కార్యాలయం నుంచి వర్తమానం అందింది. ఈ నెల  29న కేంద్ర మంత్రి వర్గం విస్తరణ దృష్ట్యా అమిత్ షా విజయవాడ పర్యటన సెప్టెంబర్ మొదటివారానికి వాయిదా పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top