చీకట్లో కుట్రేంటి చిన్నమ్మా?: అంబటి

చీకట్లో కుట్రేంటి చిన్నమ్మా?: అంబటి - Sakshi


 సుష్మా స్వరాజ్‌కు వైఎస్సార్ సీపీ నేత అంబటి సూటి ప్రశ్న

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును ఈ నెల 13వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఇలా అయితే సహకరించబోమని చెప్పిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అంతలోనే మాటమార్చి సభలో ఎలా మద్దతిచ్చారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎందుకు మాట మార్చారు... చిన్నమ్మా (సుష్మాస్వరాజ్)? చీకట్లో ఏం కుట్ర జరిగింది చిన్నమ్మా? లోక్‌సభ ప్రసారాలు నిలిపివేసి మరీ చీకట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఏం ఆశించి బీజేపీ ఇలా చేసింది?’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయం, అక్రమం... అన్నదమ్ములు, మిత్రుల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతోందని గావుకేకలు పెట్టిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు.

 

 అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించుకునేందుకు ఎందుకు సహక రించారో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అంబటి డిమాండ్ చేశారు. సోనియాగాంధీ, బీజేపీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం పదవి నుంచి వైదొలగిన కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేసి రాష్ట్ర విభజనను సజావుగా సాగించారన్నారు. విభజనకు పూర్తిగా సహకరించి అంతా అయ్యాక కిరణ్ ఇపుడు రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నిం చారు. కిరణ్ అసమర్థత, సంకుచితత్వం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మండిపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉండి ఉంటే తెలుగు ప్రజలను ఇలా చీల్చే వారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.  

 

-    కిరణ్ ఇన్నాళ్లూ అధిష్టానం చెప్పినట్లు నటించి ఇపుడు రంగు తీసేసి బయటకు వెళుతున్నారు.

-   తెలుగు ప్రజలకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన నమ్మక ద్రోహం అంతాఇంతా కాదు.

-    సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న నాడే సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయకుండా చివరి బంతి అని చెబుతూ లక్షల ఫైళ్లపై చివరి సంతకం వరకూ చేసి లక్షల కోట్లు గడించారు.

-   ఇపుడిక కిరణ్ రాజీనామా చేస్తే ఏంటి? చేయకుంటే ఏంటి?

-   రాష్ట్ర విభజన దారుణమైన రీతిలో అప్రజాస్వామికంగా జరిగిపోతుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమిటి? రోజుకో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడ్డం తప్ప.

-    చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గూ, ఎగ్గూ, నీతి, నిజాయితీలు ఉంటే ఆయన నిర్వహించిన పాత్రకు సిగ్గుపడి రాజకీయాలు వదిలి వెళ్లి పోవాలని అంబటి రాంబాబు సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top