వడ్డీ కూడా మాఫీ కాలేదన్నా..
ఆత్మకూరు: ఈ టీడీపీ ప్రభుత్వంలో కొత్తగా తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా మాఫీ కాలేదన్నా..అని ఆళ్లగడ్డ వీరభద్రస్వామి ఎస్ఎల్జీ పొదుపు మహిళలు వైఎస్జగన్ను కలిసి సమస్య విన్నవించారు. నాగేశ్వరమ్మ, లక్ష్మిదేవి, గ్రూప్ మహిళా లీడర్లు మాట్లాడుతూ గతంలో పొదుపు రుణాలు మాఫీ చేస్తామని..రూ.10 వేలు ఇస్తామని చెప్పి మూడో విడత రూ.3 వేలు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు. పొదుపు గ్రూపుసభ్యులకు నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అభయహస్తం పింఛన్కు అదనంగా మరో రూ.500 పెంచితే బాగుంటుందని విన్నవించారు. అలాగే ఆళ్లగడ్డ పరిధిలో పరిశ్రమలు లేవని, ఉపాధి కల్పిన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. అందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పొదుపు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని, అలాగే ఆళ్లగడ్డలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.